హైదరాబాద్ : ఈ మధ్య కేరళలో జరిగిన సౌత్ ఇండియా జూనియర్ అథ్లెటిక్స్లో అండర్ -16 విభాగంలో.. 2 వేల మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించిన జనగామ జల్లా పాలకుర్తి మండలం గూడూరుకు చెందిన చెరిపెల్లి కీర్తనను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.
మంగళవారం తనను తన క్యాంపు కార్యాలయం మినిస్టర్స్ క్వార్టర్స్లో కలిసిన కీర్తనను మంత్రి ప్రత్యేకంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కీర్తన అసమాన ప్రతిభను కనబరుస్తూ అండర్ -16 జూనియర్ అథ్లెటిక్ విభాగంలో స్వర్ణ పతకం గెలవడం సంతోషించదగ్గ విషయమన్నారు. గ్రామీణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కీర్తను ప్రతిభకు గురుకుల పాఠశాల పదను పెట్టిందన్నారు. ప్రభుత్వ పరంగా కీర్తనను ప్రోత్సహిస్తామన్నారు.