నిజాంసాగర్, మార్చి 15 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో నిజాంసాగర్ గ్రామ రూపురేఖలు మారిపోయాయి. అన్ని హంగులతో వైకుంఠధామం నిర్మించారు. బస్టాండ్ పక్కనే సువిశాలమైన స్థలంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పూల మొక్కలతో ఎంతో ప్రశాంతతను అందిస్తున్నది. పల్లె ప్రకృతి వనం జిల్లాలోనే ఆదర్శంగా నిలిచింది. కంపోస్టు షెడ్డు, డంపింగ్యార్డు ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి వాటికి కంచెలను ఏర్పాటు చేసి ట్యాంకరు ద్వారా నీటిని అందిస్తుండడంతో ఏపుగా పెరిగాయి. కోతుల ఆహారశాలలో నాటిన 1500 మొక్కలు ఏపుగా పెరిగి కాయలు, పండ్లు సైతం అందిస్తున్నాయి. నిత్యం ఇంటింటి చెత్తసేకరణ, మురుగు కాలువలను శుభ్రం చేయడంతో స్వచ్ఛ గ్రామం దిశగా అడుగులు వేస్తున్నది. వైకుంఠధామం చుట్టూ కంచెను ఏర్పాటు చేసి వాటిలో మొక్కలుసైతం నాటారు. పక్కనే కంపోస్టు షెడ్డు, డంపింగ్ యార్డును నిర్మించి బోరుబావినిసైతం ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించారు. వైకుంఠధామంలో పురుషులకు, మహిళలకు వేర్వేరుగా దుస్తులు మార్చుకునే గదులు, స్నానాలు చేసేందుకు గదులను నిర్మించారు.