సింగరేణి అధికారులకు 92.4 కోట్ల ‘ప్రతిభా ఆధారిత ప్రోత్సాహకం’
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో విడుదల
నేరుగా అకౌంట్లలో జమ
ఈ-1 అధికారులకు లక్ష
ఈ-8 ఉన్నతాధికారులకు 7లక్షల దాకా చెల్లింపులు
అధికారుల్లో హర్షం
గోదావరిఖని, మార్చి 13:సింగరేణి సంస్థకు వెన్నుదన్నుగా ఉంటూ.. సంస్థ ప్రగతికి బాటలు వేస్తున్న అధికార యంత్రాంగం శ్రమకు తగ్గ ప్రోత్సాహం దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో 2018-19కి సంబంధించి లాభాల్లో నుంచి ఫర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) శనివారం అధికారులకు అందింది. ఈ-1 అధికారులకు లక్ష, ఈ-8 ఉన్నతాధికారులకు 7లక్షల దాకా నేరుగా అకౌంట్లలో జమ చేయగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
సింగరేణి సంస్థలో అధికారులకు ప్రోత్సాహక నగదు వచ్చేసింది. సంస్థలో పనిచేస్తున్న 2032 మంది అధికారులకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) అందింది. లాభాల్లో కార్మికులకు వాటా మాదిరిగానే అధికారులకు గ్రూప్ పర్ఫార్మెన్స్, వ్యక్తిగత ప్రతిభ ఆధారిత ప్రోత్సాహకాన్ని ఐదేళ్లుగా చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన లాభాల నుంచి పీఆర్పీ కింద 92.4 కోట్లు చెల్లింపునకు ఇటీవలే సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, శనివారం అధికారుల ఖాతాల్లో జమ చేశారు. ఇందులో ఈ-1 అధికారులుగా పిలువబడే జూనియర్ అధికారులకు లక్ష వరకు, ఈ-8లోని ఉన్నతాధికారులకు 7లక్షల ప్రోత్సాహక నగదు అందింది. పెండింగ్లో ఉన్న పీఆర్పీ ఇవ్వాలని ఇటీవల సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో సంస్థ సీఎండీ శ్రీధర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం సీఎండీ ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పీఆర్పీ చెల్లింపునకు అనుమతి పొంది అందజేశారు.
స్వరాష్ట్రంలోనే అధికారులకు గుర్తింపు
ఒకప్పుడు పీఆర్పీ విధానం కోల్ ఇండియాలో మాత్రమే ఉండేది. సింగరేణిలో అమలు చేయాలని అధికారులు ఎన్నో ఏండ్ల నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ క్రమంలో స్వరాష్ట్రంలో సమస్యను తెలుసుకున్న సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే పీఆర్పీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో 2014-15లో తొలిసారిగా చెల్లించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. గ్రూపు పర్ఫార్మెన్స్ ఆధారంగా 85 శాతం, వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా 15 శాతాన్ని అధికారులకు చెల్లిస్తుండగా, హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ కృషితోనే పీఆర్పీ
స్వరాష్ట్రంలోనే అధికారుల ప్రతిభకు తగ్గ గుర్తింపు, ప్రోత్సాహకం అందుతున్నది. కోలిండియాలో అమలు చేస్తున్న పీఆర్పీని సింగరేణిలో అమలు చేయాలని తాము చేసిన విజ్ఞప్తితో సీఎం కేసీఆర్ అంగీకరించి అందజేస్తున్నారు. సింగరేణి అధికారులంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారు.
-జక్కం రమేశ్, సీఎంవోఏఐ అధ్యక్షుడు