పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పరిసమాప్తం
నేటి నుంచి నాలుగు మండలాల్లో 144 సెక్షన్
రేపు పోలింగ్.. ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
పోలింగ్ కేంద్రాలకు జియో ట్యాగింగ్
ప్రత్యేక పోలీస్ బృందాలతో గస్తీ
జోరుగా సాగిన గులాబీ శ్రేణుల ప్రచారం
చేర్యాల, మార్చి 12:పోలింగ్ కేంద్రాలకు జియో ట్యాగింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు జియో ట్యాగింగ్ పూర్తిచేసినట్లు సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. జిల్లా అధికారులు, స్థానిక అధికారులతో కలిసి పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. మూడు ైస్లెకింగ్ ఫోర్స్, మరో 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 2మొబైల్ పార్టీలు, స్టాటిస్టికల్ ఆల్ సర్వైలైన్స్ బృందాలు 2 ఏర్పాటు చేశారు. ఏసీపీ నేతృత్వంలో ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, 84 మంది హెడ్కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించనున్నారు.
నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శుక్రవారం ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఉన్న చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాల పరిధిలోని అన్ని గ్రామాలు, పోలింగ్ కేంద్రాల వద్ద ఈ నెల 15వతేదీ ఉదయం 8గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ డి.జోయల్ డెవిస్ ప్రకటించారు.
నాలుగు మండలాల్లో 144 సెక్షన్ అమలు..
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో 144సెక్షన్ అమలు చేస్తున్న సీపీ ప్రకటించారు. సెక్షన్ అమలు సందర్భంగా ఈ నాలుగు మండలాల్లో ఐదుగురు వ్యక్తులు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా తిరగవద్దు. రాజకీయ పార్టీల జెండాలు, పార్టీ గుర్తులు, ప్లేకార్డ్స్ ధరించొద్దు. ప్రదర్శిస్తే కేసులు నమోదు చేస్తారు. మైకులు, లౌడ్ స్పీకర్లు వాడకూడదు. పాటలు, ఉపన్యాసాలు ఇవ్వకూడదు. విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధించినట్లు సీపీ తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, పటాకులు కాల్చడం నేరంగా పరిగణిస్తామన్నారు.
పోలింగ్కు అన్ని ఏర్పాట్లు..
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులు పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు మండలాలకు చెందిన 3584 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 2679 మంది పురుషులు, 905 మంది మహిళలకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చేర్యాల పట్టణంలోని మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూలు రెండు పోలింగ్ కేంద్రాలు, కొమురవెల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రెండు వారాలుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను కోరారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పాటు నిరుద్యోగ యువత కోసం పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయాన్ని గ్రాడ్యుయేట్లకు వివరించారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 29శాతం ఫిట్మెంట్తో కూడిన పీఆర్సీని ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధ్దంగా ఉన్న విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు ప్రచారం సమయంలో వారికి వివరిస్తున్నారు. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి పల్లా గెలుపే ధ్యేయంగా సన్నాహక సమావేశాలు, ప్రచారంలో పాల్గొన్నారు.
పోలింగ్ సజావుగా సాగేందుకు ప్రత్యేక బృందాలు..
పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 16మంది నోడల్ అధికారులు పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించనున్నారు. 6ైప్లె స్కాడ్ బృందాలు, 6స్పెషల్ వీడియో టీమ్స్, ఇద్దరు సెక్టోరియల్ అధికారులు, 2మాస్టర్ ట్రైనర్స్, 5సింగిల్ విండో సిస్టమ్స్, 5ఎంసీఎంసీ టీమ్స్, 2ఎస్ఎస్టీ బృందాలు, ఇద్దరు రూట్ అధికారులు, 8మంది కౌం టింగ్ టీమ్స్, 6పీవోలు, 6ఏపీవోలు, 12మంది ఓపీవోలను నియమించారు.