న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ ఉధృతి రోజురోజుకు మరింత పెరుగుతున్నది. శుక్రవారం ఉదయానికికల్లా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 23,285 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 117 మంది కరోనా బాధితులు మృతిచెందారు. అయితే ఈ 23 వేల పైచిలుకు కొత్త కేసుల్లో మెజారిటీ కేసులు కేవలం ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. కొత్త కేసుల్లో 85.6 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లోనే బయటపడ్డాయని, ఆ ఆరు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అందుకే ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ విస్తరిస్తున్న తీరు, చేపడుతున్న ప్రజారోగ్య కార్యక్రమాలపై తాము నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నామని కేంద్ర సర్కారు తెలిపింది.