నడి వయసును ఓ సమస్యగా, సంక్షోభంగా భావించేవారే ఎక్కువ. నాగారం నివాసి మహాలక్ష్మి మాత్రం.. నడి వయసులోనే తన క్రీడాజీవితాన్ని ప్రారంభించారు. అవరోధాలను గెలిచి పతకాల పంట పండించారు. ఉద్యోగానికి, కుటుంబ బాధ్యతలకు న్యాయం చేస్తూనేమైదానంలో మెరుపులు మెరిపిస్తున్నారు.
చదువుకునే సమయంలోనే అన్నంరాజు సీతామహాలక్ష్మి క్రీడలపై ఆసక్తి కనబరచేది. జిల్లా, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నది. పదో తరగతిలో ఉండగా, విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఆ సమయంలో సీతామహాలక్ష్మి తల్లి అనారోగ్యం పాలయ్యారు. దీంతో పోటీల్లో పాల్గొనలేకపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే పెండ్లి. దీంతో ఆటలకు, చదువులకు ఫుల్స్టాప్ పడింది. భర్త, పిల్లలకే జీవితం అంకితమైంది. ఇంతలోనే, భర్త అకాల మరణం రూపంలో పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. కుటుంబ భారమంతా తనపైనే పడింది. జీవనాధారం కోసం ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం సంపాదించింది. జీవితంలో కాస్త కుదురుకున్నాక మళ్లీ క్రీడలపై దృష్టి పెట్టింది. శిక్షణ తీసుకుంది. కఠోర సాధన చేసింది. లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, షాట్పుట్లలో రాణించింది. ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన వివిధ పోటీల్లో పతకాలు సాధించింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో జరిగిన అంతర్రాష్ట్ర పోటీలకు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించింది.
ప్రతిభకు తార్కాణం
ఇండొనేషియాలోని జకార్తాలో జరిగిన ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్-2018లో మహాలక్ష్మి 40 ఏండ్ల విభాగంలో పాల్గొన్నది. అసమాన ప్రతిభతో బంగారు పతకం సాధించింది. రెండేండ్ల క్రితం.. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి మీట్లో లాంగ్జంప్, షాట్పుట్ విభాగాల్లో బంగారు పతకం సాధించింది. ‘నా క్రీడా జీవితంలో ఇంకా ఎన్నో మైలురాళ్లను దాటాలని భావిస్తున్నా. ఆటలకే కాదు దేనికీ వయసు అడ్డంకి కాదు ’ అంటున్నది సీతామహాలక్ష్మి.
-నాయకపు నాగరాజు