హైదరాబాద్ : అన్నిశాఖల మాదిరే అటవీశాఖలోనూ మహిళలు పనిచేసేందుకు పోటీపడటం గర్వకారణమని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అటవీశాఖలో పనిచేస్తున్న మహిళా అధికారులు, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా ఐఎఫ్ఎస్ అధికారుల వివరాలతో రూపొందించిన ‘గ్రీన్ క్వీన్స్ ఆఫ్ ఇండియా – నేషన్స్ ప్రైడ్’ పుస్తకాన్ని మంత్రి ఆన్లైన్లో ఢిల్లీ నుంచి ఆవిష్కరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 284 మంది మహిళలు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో వివిధ స్థానాల్లో పనిచేస్తున్నారని వారిలో ముగ్గురు (తెలంగాణ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్) అటవీ సంరక్షణ ప్రధాన అధికారులుగా (పీసీసీఎఫ్) ఉన్నారని వెల్లడించారు. అడవుల్లోనూ పనిచేసేందుకు పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం అని ప్రకాశ్ జవడేకర్ అన్నారు.
భవిష్యత్లో 33 శాతం మంది పనిచేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ అటవీశాఖలో సుమారు 30 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని పీసీసీఎఫ్ ఆర్ శోభ, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా అభినందించారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దేశవ్యాప్తంగా అటవీ శాఖలో పనిచేస్తున్న మహిళా అధికారులతో సెమినార్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆన్ లైన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితోపాటు పలువురు అధికారులు, ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తున్న మహిళా ఐఎఫ్ఎస్ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ అరణ్య భవన్ నుంచి పీసీసీఎఫ్ ఆర్ శోభతోపాటు, దేశంలో మొదటిసారిగా ఐఎఫ్ఎస్కు ఎంపికైన సీఎస్ రామలక్ష్మి (రిటైర్డ్), కమళా శోభనా రావు (రిటైర్డ్), సోనిబాల దేవి, ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ హాజరయ్యారు. కేంద్ర అటవీ శాఖ కార్యదర్శి ఆర్పీ గుప్త, డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్, సెంట్రల్ ఐఎఫ్ఎస్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.