హైదరాబాద్ : సులభతరం, జీవన ప్రమాణాల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ హైదరాబాద్ నగరానికి 24వ ర్యాంక్ ప్రకటించడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో దూసుకుపోతోందన్నారు. హైదరాబాద్ కీర్తిప్రతిష్టలు తెలిసిన వారెవ్వరూ 24వ ర్యాంక్ ఇవ్వడాన్ని అంగీకరించరన్నారు. ఉత్తమ నగరానికి ఉండాల్సిన అన్ని అర్హతలు హైదరాబాద్కు ఉన్నాయని ఇప్పటికే పలు అంతర్జాతీయ, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ర్యాకింగ్ నిర్ధారణకు ఉపయోగించిన మెథడాలజీ, సమాచారం సేకరణ కోసం తయారు చేసిన ప్రశ్నావళి అసంబద్ధంగా ఉందని మేయర్ అన్నారు. జీవన ప్రమాణాలకు కేవలం 35 శాతం, ఆర్థిక ప్రమాణాలకు 15 శాతం మార్కులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదన్నారు.
అత్యంత ప్రాధాన్యమైన పౌర సేవల విభాగాన్ని ఈ సర్వేలో పేర్కొనలేదన్నారు. ఆర్థిక పరమైన వివరాలు, టాయిలెట్ల వినియోగం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పర్యటించి స్వీకరించాల్సి ఉండగా ప్రభుత్వ గణాంకాల ఆధారంగా బేరీజు వేయడం అశాస్త్రీయమన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ ర్యాంకింగ్లో విశ్వసనీయత లోపించిందన్నారు. ఈ ర్యాంకింగ్ ప్రక్రియను మింట్ అనే జాతీయ పత్రిక సైతం తప్పుపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్కు దాదాపుగా 25కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయన్నారు. హైదరాబాద్కు 24వ ర్యాంకింగ్ ప్రకటించడంలో రాజకీయ దురుద్దేశం ఉందని భావించాల్సి వస్తున్నదన్నారు.
బంజారాహిల్స్లోని తన నివాసం వద్ద విద్యుత్ లైన్ల నిర్మాణ పనులు జరుగుతుండగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుండటంతో తాత్కాలికంగా జనరేటర్ను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరానని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. పనులకు అంతరాయం కలగకుండా ఉండేందుకే జనరేటర్ కావాలని అడిగానని పేర్కొన్నారు. అంతేకానీ నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉందని పేర్కొన్నట్లుగా కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ఇలాంటి వార్తలపై ఆమె విచారం వ్యక్తం చేశారు.