హైదరాబాద్ : అందరి సహకారంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని గెలిపించుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నగరంలోని మియాపూర్లో మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీ దేవికి మద్దతుగా శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, టీఆరెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. మీరు అందించిన స్ఫూర్తితో ఇవాళ మేయర్ పీఠంలో ఉన్నామన్నారు. పెరిగిన ధరలు, మండే పెట్రోల్ రేట్లతో ఓటర్లు బీజేపీపై వ్యతిరేకంగా ఉన్నారన్నారు. బీజేపీ చేసిన ఒక్క మంచి పని చూపెట్టమని అడగాలన్నారు. విభజన హామీల్లో భాగంగా ఐటీఐఆర్ ఇవ్వలేదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు. నిన్న జడ్చర్లలో అడ్వకేట్స్ బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుని గెట్ఔట్ అని తిప్పి పంపారు. పోటీచేసే అభ్యర్థులలో ఒకే ఒక్క మహిళా అభ్యర్థి మన వాణి దేవి. మార్చి 8న మహిళ దినోత్సవం సందర్భంగా మహిళా ఓటర్లు అందరిని పిలిచి మహిళ శక్తి చూపించాలి. లక్ష 95 వేల మహిళా ఓట్లు ఉన్నాయి. మంచి స్పందన ఉంది. మహిళా ఓటర్లను మన వాణి దేవికి ఓటు వేసే విధంగా చూడాలి. బీజేపీకి క్యాడర్ లేదు, కార్యకర్తలు లేరు. గ్లోబల్ ప్రచారం తిప్పికొట్టాలి. సోషల్ మీడియాలో వాళ్లకు కౌంటర్ ఇవ్వాలి. అందరి సహకారంతో వాణీ దేవిని గెలిపించుకోవాలన్నారు.
ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వాణీ దేవి గెలుపుకోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. పీవీ నర్సింహ రావు కూతురు, మంచి విద్యావేత్త మన అభ్యర్థి అన్నారు. వాణీ దేవిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మనమే అగ్రభాగాన ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది శూన్యం అన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలు అవుతున్నాయన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆగలేదన్నారు.