హైదరాబాద్ : పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో యాదాద్రి దివ్య క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తుది మెరుగులతో తీర్చిదిద్దుకుంటే, రానున్న మే మాసంలో ఆలయాన్ని పునఃప్రారంభం చేసుకునే అవకాశాలున్నాయని ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ పరిశీలించారు. సుమారు ఆరు గంటలకు పైగా ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం చుట్టు పక్కల అనుబంధంగా జరుగుతున్న పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ పునః నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికావచ్చిన నేపథ్యంలో ఇంకా అసంపూర్తిగా ఉన్న పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు సీఎం యాదాద్రిలో పర్యటించారు.
హైదరాబాద్ నుంచి యాదాద్రికి చేరుకున్న సీఎం తొలుత బాలాలయంలో పూజలు నిర్వహించారు. దైవ దర్శనానంతరం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. యాదాద్రి ఆలయంలొ ఇంకా ఏ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.. అవి ఎన్నిరోజుల్లో పూర్తవుతాయనే విషయాలపై ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టి సారించారు. ప్రధాన ఆలయ ప్రాగణంలో కలియదిరిగిన సీఎం కేసీఆర్ మాడ వీధులు, క్యూ లైన్ దారి, ప్రాకార మండపాలు, దర్శన సముదాయాలను, బ్రహ్మోత్సవం మండపం, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లు, శివాలయ నిర్మాణం పురోగతి, స్వామి పుష్కరిణీ, భక్తుల స్నానగుండం నిర్మాణం, మెట్ల దారి నిర్మాణాలను పరిశీలించారు. మెరుగైన రీతిలో తీర్చి దిద్దేందుకు పలు సూచనలు చేశారు.
భక్తి వైకుంఠంలో సంచరించే అనుభూతి కలగాలి..
అలయ చుట్టూ ప్రహరీకి మరింత శోభను ఇచ్చేలా, ప్రాచీన చిత్రకళ ఉట్టిపడేలా అలంకృత రూపం(ఆర్ణమెంటల్ లుక్కు)’ తో వుండేలా, బ్రాస్ మెటల్తో సుందరంగా తయారు చేయాలన్నారు. ఆలయాన్ని దూరం నుంచి దర్శించిన భక్తులకు భక్తి భావన వుట్టి పడేలా దీపాలంకరణ ఉండాలన్నారు. దేవాలయ ముందుభాగం కనుచూపు మేర నుంచి చూసినా అత్యద్భుతంగా తీర్చి దిద్దాలని,. ప్రాచీనత, నవ్యతతో పాటు దైవ సందర్శకులకు భక్తి వైకుంఠంలో సంచరించే అనుభూతిని కలిగించాలన్నారు. తుది మెరుగులు దిద్దుతున్న నేపథ్యంలో, దేశంలోని వివిధ ఆలయాల్లోని శిల్ప సంపద ఎలా ఉందో చూసి రావాలని అధికారులకు సూచించారు. ప్రహ్లాద చరిత్ర సహా నరసింహుని చరిత్రను తెలియ పరిచే పురాణ దేవతల చరిత్రలు అర్ధమయ్యేలా శిల్పాలతో ఆలయ ప్రాంగణంలో అలంకరించాలన్నారు. ప్రహరీని ఆనుకుని ఉండే విధంగా క్యూలైన్ నిర్మాణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. సౌకర్యవంతమైన ఎత్తుతో విశాలంగా క్యూ లైన్ దారిని నిర్మించాలన్నారు.
పూజా కార్యక్రమాలు భక్తులకు స్పష్టంగా కనిపించాలి..
మూల విరాట్టుకు అభిషేకం చేసే సందర్భంలో పూజా కార్యక్రమాలు భక్తులకు స్పష్టంగా కనిపించేలాగా ప్రధాన ద్వారం వద్ద అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం సూచించారు. గర్భగుడి ముందరి ధ్వజస్థంభాన్ని, హనుమాన్ విగ్రహాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన తంజావూర్ పెయింటింగులను పరిశీలించారు. నృసింహ స్వామి గర్భగుడిలో పూజలు చేశారు. బంగారు తాపడం చేసిన పలు దేవతా మూర్తులను పరిశీలించారు. ఆండాళ్ ఆల్వార్ అమ్మవారి గుడిని, పరకామణిని పరిశీలించారు. మూలవిరాట్ దైవ దర్శనానంతరమే క్షేత్రపాలకుని దర్శనం ఆనవాయితీగా వస్తున్నదని, దాన్నే కొనసాగించాలని సూచించారు. అత్యద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దుతున్నపుడు హడావిడి పడకూడదన్నారు. తిరుపతిలో లాగా స్వామివారికి సేవలందేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు.
ఇతర దేవాలయాలకు ఆదర్శంగా యాదాద్రి..
స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో యాదాద్రి దేశంలోని ఇతర దేవాలయాలకు ఆదర్శంగా ఉండాలని, ఇందుకోసం అవసరమైన మేరకు ఉద్యోగులను నియమించుకోవాలను అధికారులకు సీఎం చెప్పారు. నిర్మాణం పూర్తికావచ్చిన ఈవో కార్యాలయాన్ని, స్వామివారి పల్లకీ గద్దెను, అద్దాల మండపాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రెయిలింగ్ పనులను చూసి మెచ్చుకున్నారు. అద్దాల మండపాన్ని అద్భుతంగా ప్రత్యేకత చాటుకునేలా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. అవసరమైతే చైనా సందర్శించి అక్కడ 7 కి.మీ. దూరం లైట్లతో నిర్మించిన మాల్ ను సందర్శించి రావాలన్నారు. హుండీలను ఎక్కడ ఏర్పాటు చేయాలో, భక్తులు ప్రసాదం తీసుకునే కౌంటర్లు ఎక్కడ ఉండాలో అధికారులకు సీఎం సూచనలిచ్చారు. బంగారు తాపడం చేసిన కళశాలు, విగ్రహాలు ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. యాదాద్రిలో గెస్ట్ హౌస్ లిఫ్టులు ఇంకా పూర్తికాకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
పేద బ్రాహ్మణ పెద్దలకు మండపం నిర్మాణం..
ఒడిషాలోని పూరీ జగన్నాథ ఆలయంలో మాదిరిగా పదవీ విరమణ పొందిన పూజారులు, పేద బ్రాహ్మణ పెద్దలు తమ భుక్తినీ వెల్లదీసుకునేలా, దయగల భక్తుల నుంచి కానుకలు స్వీకరించి వారి జీవన భృతిని కొనసాగించేలా ఇక్కడ కూడా మండపం నిర్మాణం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం పూరీ ఆలయాన్ని సందర్శించి రావాలన్నారు.
శిల్పులకు ఇళ్ల స్థలాల పరిశీలన…
శివాలయాన్ని దర్శించిన సీఎం కేసీఆర్ రుత్విక్కుల కోసం మండపం బాగా కట్టారని కితాబిచ్చారు. క్యూ కాంప్లెక్సులో భక్తులకు ఆహ్లాదంగా వుండేలా శ్లోకాలు, భక్తి గీతాలు శ్రావ్యంగా వినిపించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. మెట్లదారి నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, వాళ్లు నేరుగా క్యూ లైన్ కాంప్లెక్స్ చేరేలా నిర్మాణాలుండాలన్నారు. స్వామివారి పుష్కరిణిని పరిశీలించిన సీఎం గుండంలో స్నానం చేసే భక్తుల కోసం అన్ని సౌకర్యాలుండేలా చూడాలని ఆదేశించారు. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పూజారులు సహా, ఆలయ సిబ్బంది నివసించేందుకు అనువైన ఇండ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. శిల్పులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని సీఎం ఈ సందర్భంగా చెప్పారు.