మహబూబాబాద్ : టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరు క్రియాశీలకంగా వ్యవహరించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో భాగంగా మహబూబాబాద్లోని ముఖ్య నాయకులకు పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సభ్యత్వ నమోదును నిర్ణీత గడువులోపు పూర్తిచేయాలని సూచించారు. సభ్యత్వ నమోదు సమయంలో సభ్యుల పూర్తి వివరాలను తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు బీమా అందించడంలో ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు.
దేశంలో ఏ పార్టీ చేయని విధంగా టీఆర్ఎస్ తన కార్యకర్తల సంక్షేమం కోసం ఏటా 16 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లిస్తుందని చెప్పారు. ఇప్పటికే 60 లక్షల సభ్యత్వంతో రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న టీఆర్ఎస్ త్వరలో కోటి మంది కార్యకర్తలు కలిగిన పార్టీగా అవతరిస్తుందన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఈ స్పందనకు అనుగుణంగా పార్టీ నేతలు ఈ సభ్యత్వం నమోదును విజయవంతంగా నిర్వహించాలని కోరారు.