నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. కీలకమైన భూసేకరణ ప్రక్రియ నెలరోజుల్లో కొలిక్కి రానున్నది. 1500 ఎకరాల విస్తీర్ణం.. ఐదు టీఎంసీల సామర్థ్యం.. రూ. 35,000 కోట్ల అంచనా వ్యయంతో మేడ్చల్ జిల్లా కేశవాపూర్లో నిర్మించే ఈ ‘కాళేశ్వర జల ప్రదాయిని’తో మహానగరానికి నీటి కష్టాలు పూర్తిగా తొలగిపోనున్నాయి.
భూ సేకరణ పూర్తయిన తర్వాత నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లింపులపై జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి నేతృత్యంలో సంప్రదింపుల కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనున్నది. పరిహారం చెల్లింపులు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు.
కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో అడవి కోల్పోతుండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు ఇతర జిల్లాల్లో భూమిని కేటాయించనున్నది. యాదాద్రి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో స్థలం కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు మేడ్చల్ జిల్లా అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అక్కడ అడవుల పెంపునకు చర్యలు తీసుకుంటారని చెప్పారు.
రిజర్వాయర్కు అవసరమయ్యే భూమి కోసం అటవీ శాఖకు చెందిన 1012, లావునిపట్టా 266, ప్రభుత్వ భూమి 130, పట్టాదారు రైతులకు చెందిన 92 ఎకరాలు సేకరిస్తున్నారు. ఇందులో 35 ఎకరాలకు సంబంధించిన రూ. 15 కోట్ల 5 లక్షలను రైతులకు చెల్లించారు. మిగతా 55 ఎకరాలకు సంబంధించిన పరిహారాన్ని అందించేందుకు చర్యలుతీసుకుంటున్నారు. ఇక లావునిపట్టా 266 ఎకరాలకు సంబంధించి త్వరలోనే పరిహారం చెల్లించే విషయమై సంప్రదింపుల కమిటీలో నిర్ణయం తీసుకోనున్నారు.
కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే నగరానికి తాగునీటి సమస్య శాశ్వతంగా తీరుపోతుంది. కొండ పోచమ్మ ప్రాజెక్ట్ నుంచి కాళేశ్వర జలాలను ఈ రిజర్వాయర్కు తరలించి.. నగరంతో పాటు మున్సిపాలిటీలకు నీటిని సరఫరా చేస్తారు.