ఎల్ఈడీ వెలుగుల్లో గోలేటి టౌన్షిప్
మిషన్ భగీరథ నీటి సరఫరాపై కార్మికుల హర్షం
రెబ్బెన, సెప్టెంబర్ 19;సింగరేణి యాజమాన్యం చేపడుతున్న అభివృద్ధి పనులతో కార్మిక కాలనీకి కొత్తరూపు వస్తున్నది. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి, చర్యలు చేపడుతున్నది. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్షిప్ కార్మిక కాలనీలు, ఆధికారుల బంగ్లాలు, ప్రధాన రహదారి వెంట కొత్తగా ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయడంతో రాత్రిళ్లు పగటిలా కాంతులీనుతున్నది. కార్మిక కాలనీల్లో తాగునీటి సమస్యను టీబీజీకేఎస్ నాయకులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మిషన్ భగీరథ పథకం ద్వారా పైప్లైన్ ఏర్పాటు చేసి మంచినీరు అందిస్తున్నారు. దీంతో కార్మిక కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సీఈఆర్ క్లబ్లో వివిధ కార్యక్రమాల సమయంలో భోజనాలు చేయడానికి కొత్తగా డైనింగ్ హాల్ నిర్మించారు. కార్మికులు, కార్మికుల పిల్లల కోసం కొత్తగా జిమ్ ఏర్పాటు చేయడంతో యువత సద్వినియోగం చేసుకుంటున్నది.
టీబీజీకేఎస్తోనే సమస్యల పరిష్కారం
గోలేటిటౌన్షిప్ కార్మిక కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై టీబీజీకేఎస్ హర్షం వ్యక్తం చేస్తున్నది. కార్మిక కాల నీలో అభివృద్ధి పనులు చేపట్టాలని టీబీజీకేఎస్ విన్నవించగా, యాజమా న్యం సానుకూలంగా స్పందించింది. గోలేటిటౌన్షిప్లో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయడం, మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందించడం హర్షిస్తున్నాం. రానున్న రోజుల్లోనూ వివిధ సమస్యలపై కార్మికలోకానికి అండగా నిలిచి, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తాం.
-మల్రాజు శ్రీనివాసరావు, టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు
భగీరథ నీరు రావడం సంతోషకరం
కార్మిక కాలనీకి సింగరేణి యాజమాన్యం మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించడం సంతోషకరం. గనుల నుంచి వచ్చే నీరు తాగి, గతంలో ఇబ్బందు లు ఎదుర్కొన్నాం. చాలా మంది తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు. కార్మిక కుటుంబాలకు మిషన్ భగీరథ ద్వారా తాటునీటి గోస తీర్చిన యాజమాన్యానికి కృతజ్ఞతలు.
-మిట్టపల్లి కుమారస్వామి, ఎలక్ట్రీషన్-గోలేటి కార్మికకాలనీ
కాలనీల అభివృద్ధికి కృషి
బెల్లంపల్లి ఏరియా లోని కార్మికకాలనీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. కార్మికులు, వారి కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని, వారికి అవసరం అయిన అన్ని పనులు పూర్తి చేస్తున్నాం. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతో పాటు కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం ప్రాధాన్యమిస్తున్నది. కార్మికులు వారి సమస్యలను మా దృష్టికి తేవచ్చు.
-సంజీవరెడ్డి, జీఎం-బెల్లంపల్లి ఏరియా