అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తున్న అధికారులు
38 నమోదు కేసులు.. 81 మంది అరెస్ట్
రూ. 94 లక్షల విలువైన నకిలీ విత్తనాలు, మందులు స్వాధీనం
హెచ్చరించినా మారని వ్యాపారులపై పీడీ యాక్ట్
ఇప్పటికే ఏడుగురిపై కేసులు.. మరికొందరిపైనా చర్యలకు సిద్ధం
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్18(నమస్తే తెలంగాణ): నకిలీ దందాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా టాస్క్ఫోర్స్ ప్రత్యేక నిఘా పెట్టింది. నిత్యం ఎక్కడోచోట దాడులు చేస్తూ అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తున్నది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 38 కేసులు నమోదు చేసి.. 81 మందిని అరెస్టు చేసింది. 94 లక్షల విలువైన 4,964 కిలోల నకిలీ విత్తనాలు, 390 లీటర్ల మందులను స్వాధీనం చేసుకున్నది. ఇక ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పురాని వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయాగిస్తున్నది. ఇప్పటికే ఏడుగురిపై కేసులు నమోదు చేయగా, మరికొంత మందిపై చర్యలకు సిద్ధమవుతున్నది.
జిల్లాలో నకిలీ దందా సాగుతున్నది. యేటా పంటలు వేసే సమయంలో కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, నిషేధిత గడ్డి మందులు విక్రయిస్తుంటారు. ఈ సీజన్లో ఇప్పటికే రైతులు పత్తి విత్తనాలు వేయడం ప్రారంభించారు. ఇదే అదనుగా భావించి కొందరు వ్యాపారులు అమాయక గిరిజన రైతులకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడోచోట నకిలీ విత్తనాలు, మందుల విక్రయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
టాస్క్ఫోర్స్ నిఘా..
నకిలీ దందాపై టాస్క్ఫోర్స్, వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. నిత్యం ఎక్కడోచోట దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. అయినా మార్పురాని వ్యాపారుల జాబితా సిద్ధం చేసి పీడీ యాక్టులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఏడుగురిపై పీడీ యాక్ట్ కేసులు నమోదయ్యాయి. మరికొంత మంది నకిలీ వ్యాపారులపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు పాత నేరస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
38 కేసులు.. 81 మంది అరెస్ట్
అక్రమార్కులపై టాస్క్ఫోర్స్ అధికారులు కొరడా ఝుళిపిస్తూనే ఉన్నారు. నకిలీ వ్యాపారుల బారి నుంచి రైతులను కాపాడేందుకు నిరంతరం నిఘాపెడుతున్నారు. ఈ యేడాది ఇప్పటి వరకు 38 కేసులు నమోదు చేసి.. 81 మందిని అరెస్ట్ చేశారు. 4964 కిలోల నకిలీ విత్తనాలు, 390 లీటర్ల నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 94 లక్షల వరకు ఉంటుంది. గతేడాది నకిలీ విత్తనాల విక్రయాలు, నిషేధిత మందుల అమ్మకాలకు సంబంధించి 59 కేసులు నమోదు చేసి.. 140 మందిని అరెస్ట్ చేశారు. 634 నకిలీ నకిలీ విత్తనాలు, 2729 లీటర్ల నిషేధిత మందులను స్వాధీనం చేసుకునారు. వీటి విలువ సుమారు రూ. 22 లక్షల వరకు ఉంటుంది.