మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
హాజీపూర్, మే 18 : జిల్లాలో కొవిడ్ బాధితులకు వైద్య, ఆరోగ్య శాఖ , సింగరేణి సమన్వయంతో మెరుగైన వైద్యం అందించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాలోని కొవిడ్ రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సింగరేణి, వైద్య ఆరోగ్య అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్లు, సిబ్బంది కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారితో స్నేహ పూర్వకంగా మెలగాలన్నారు. విధి నిర్వహణలో సమయ పాలన పాటించాలన్నారు. ప్రతి రోగి కోలుకునే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా వ్యాధి పై వారిలో ఉన్న భయాందోళనలు తొలగించి మనో దైర్యాన్ని నింపేలా అవగాహన కల్పించాలని తెలిపారు. దవాఖానలోని మౌలిక సదుపాయాలను వినియోగించుకోవాలన్నారు. సింగరేణి సంస్థ, ప్రభుత్వ శాఖ అనే తారతమ్యం లేకుండా కొవిడ్ వ్యాధి గ్రస్తులకు పారిశుధ్యం, భోజన సౌకర్యం, వైద్యం అందించడంలో సమన్వయంతో చర్యలను చేపట్టాలన్నారు. ఇందుకు గాను సింగరేణి జనరల్ మేనేజర్ వారి వైద్యాధికారులను సమావేశపరిచి తగిన ఆదేశాలను ఇవ్వాలన్నారు.
పారిశుధ్య సిబ్బంది, వార్డుబాయ్స్, ద్వితీయ తరగతి సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. బెల్లంపల్లిలోని దవాఖానలో 4 వెంటిలేటర్లు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని,అందరికి తగిన సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో కరోనాకు సంబంధించిన వివరాలను ప్రతిరోజు నివేదికను అందించాలని, లక్షణాలు కలిగిన వారిని అవసరమైతే అడ్మిట్ చేసుకోవాలని తెలిపారు. దవాఖానకు వచ్చిన వారిలో లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయాలన్నారు. పాజిటివ్ వచ్చినట్లయితే మెడికల్ కిట్ అందించి హోమ్ ఐసోలేషన్లో పాటించాల్సిన నిబంధనలను తెలియజేయాలన్నారు. కరోనా కట్టడికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ అరవింద్, గోలేటి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్, డిప్యూటీ సీఎంవో డాక్టర్ శౌర్య, రాధాకృష్ణ,అనిల్ తదితరులు పాల్గొన్నారు.