మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
అధికారులతో సమావేశం
హాజీపూర్, జూలై 17 : రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం పెంచడంతో జిల్లాలో కమిటీలను ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2013 నుంచి భూముల మార్కెట్ విలువ పెరుగలేదని జీవో నంబర్ 48 ప్రకారం అర్బన్, రూరల్ భూ ములు, వ్యవసాయ భూములకు రెండు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. మున్సిపాలిటీలు, అర్బన్ ప్రాంతాలకు అదనపు కలెక్టర్, జిల్లాలోని 16 మండలాలకు ఆర్డీవోలను చైర్మన్లుగా, కన్వీనర్లుగా సబ్-రిజిస్ట్రార్లు, సభ్యులుగా తహసీల్దార్లు, ఎంపీడీవోలను నియమించామని చెప్పారు. ఏరియాల వారీగా భూముల విలువ నిర్ణయించామని, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల వారీగా ధరలలో వ్యత్యాసాలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నరేందర్, మంచిర్యాల ఆర్డీవో వేణు, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి, సబ్-రిజిస్ట్రార్లు, ఆదిలాబాద్, మంచిర్యాల, లక్షెట్టిపేట ఆడిట్ మార్కెట్ రిజిస్ట్రార్ ఇమ్రాన్, మురళీకృష్ణ, చంద్రశేఖర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.