నిత్యావసరాలు పంపిణీ చేసిన ‘మేము సైతం’, పీజే ఫౌండేషన్ సభ్యులు
మందమర్రి, మే 17 : మందమర్రి పట్టణంలోని మూడో జోన్లో కరోనా బాధిత కుటుంబానికి మేము సైతం సభ్యులు చేయూతనందించారు. మీసాల శ్రీనివాస్, అతని కుటుంబసభ్యులు కరోనా సోకి ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. నిరుపేదలు కావడంతో ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న మేము సైతం సభ్యులు సోమవారం బాధిత కుటుంబానికి వారానికి సరిపడా కూరగాయలు, ఇతర నిత్యావసర సరకులను అందజేశారు. ఇటీవల ఉద్యోగోన్నతి పొందిన సీఐ మచ్చ శివకుమార్ సహకారంతో బాధిత కుటుంబానికి నిత్యావసర సరకులు అందించినట్లు సంస్థ అధ్యక్షుడు బుబత్తుల శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో మేము సైతం సభ్యులు కొంగల శ్రీనివాస్రెడ్డి, అగుళ్ల తిరుమలేశ్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పీజే ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
చెన్నూర్ రూరల్, మే 17: చెన్నూర్ మండలంలో కరోనా బారినపడిన నిరుపేదలకు పీజే ఫౌండేషన్ చేయూతనందిస్తున్నది. మండలంలోని సుద్దాల, ఎల్లక్కపేట గ్రామాల్లో కరోనా సోకిన బాధితులకు పీజే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 15 మందికి పప్పులు, బియ్యం, కోడిగుడ్లు, గోధుమపిండి, పండ్లను పంపిణీ చేశారు. భీమిని శ్రీనివాస్, తుమ్మల శ్రీపాల్, సతీశ్, మల్లేశ్ పాల్గొన్నారు.
నిరుపేదలను ఆదుకోవాలి..
లక్షెట్టిపేట రూరల్, మే 17 : కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థికంగా ఉన్న వారు పేదలను ఆదుకోవాలని సత్యసాయి సేవా సమితి బాధ్యుడు గంప గోవర్ధన్ కోరారు. పట్టణంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న నిరుపేద కుటుంబాలకు చెందిన ఉపాధ్యాయులు, ఆయాలు, స్వీపర్లకు కలిపి 20 కుటుంబాలకు సోమవారం నెలకు సరిపడా నిత్యావసర సరుకులను సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో బొల్లం గంగాధర్, మినుముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు