సీసీసీ నస్పూర్, మే 16 : నస్పూర్ సుందరయ్యకాలనీ సమీపంలోని వారసంత భూమి అన్యాక్రాంతంపై ఎమ్మెల్యే దివాకర్రావు ఆధ్వర్యంలో నాయకులు వంగ తిరుపతి, ఏనుగు రవీందర్రెడ్డి, వారసంత వ్యాపారులు మంత్రి ఐకే రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆదివారం సీసీసీకి వచ్చిన ఆయనకు.. వారసంత భూమి అన్యాక్రాంతంపై వివరించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వారసంత కొనసాగుతుందని తెలిపారు. 20 సంవత్సరాల క్రితం అప్పటి గ్రామ పంచాయతీ వారసంత కోసం మూడున్నర ఎకరాల భూమి కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. ఇందులో కొంత సింగరేణి భూమి ఉన్నప్పటికీ సింగరేణి కార్మికులు అధికంగా వారసంతకు వస్తుండడంతో వారికోసం భూమిని సింగరేణి యాజమాన్యం వదిలేసిందన్నారు. ప్రస్తుతం కొంత మంది సర్వేనంబర్ 72ను 76గా చూపిస్తూ ఈ భూమి తమదేనంటూ కబ్జా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని వందల మంది వ్యాపారులు ఈ వారసంతపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం ఈ స్థలాన్ని ఎంపిక చేసిందని తెలిపారు. కార్యక్రమంలో వారసంత వ్యాపారులు కండపర్తి స్వరూప, రాస రాజు, రామోజు వెంకటేశ్వర్లు, బియ్యాల లలిత, గడికొప్పుల పోషం, ధర్ని రాజబాబు, అర్కాల సదానందం, తౌటం రాజయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.