19లోగా అభివృద్ధి పనులన్నీ పూర్తవ్వాలి
అధికారులతో సమీక్షలో కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశం
ఆసిఫాబాద్టౌన్, జూన్15: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెల 19వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని వొడపల్లి గార్డెన్లో మంగళవారం వారితో పల్లె ప్రగతి పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలు, డంప్యార్డులు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాల్లో పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు తమ గ్రామాల్లో చేపడుతున్న పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని మండలాల్లో పనులు అధ్వానంగా ఉన్నాయని తీరుమార్చుకోకపోతే పంచాయతీ కార్యదర్శులపై వేటు తప్పదని హెచ్చరించారు. ప్రతి రోజూ తమ గ్రామాల్లో చేపట్టే పనుల వివరాలు ఎంపీవోలకు అందించాలన్నారు.
ఇందుకోసం ఇప్పటికే మూడు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపీడీవోలు ప్రతి రోజూ టూర్ డైరీ ఏర్పాటు చేసుకొని వారి మండలాల్లో పర్యటించాలన్నారు. ఎక్కడైనా రెవెన్యూ, అటవీ భూములు అందుబాటులో లేకపోతే పంచాయతీ నిధుల నుంచి కొనుగోలు చేసి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాల్లో 100 శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే మానేయాలని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా శిక్షణ ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి తాను అన్ని మండలాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే ఎంపీడీవోలపై చర్యలు తీసుకుంటామని, కార్యదర్శులను విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో సీఎంతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలు పల్లె ప్రగతి పనుల పర్యవేక్షణకు జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నందున పనులు త్వరగా పూర్తిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశం ఎంపీవోలు, తదితరులు పాల్గొన్నారు.