రూ. 1.20 లక్షలకు ఒప్పందం
అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించిన బాధితులు
డ్రైవర్కు ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు
బెల్లంపల్లి టౌన్, జూలై 14 : మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ పాత కేసుకు సంబంధించి, బెల్లంపల్లి టూటౌన్ ఎస్ఐ భాస్కర్రావు రూ. 2లక్షలు డిమాండ్ చేసి, రూ. 1.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఈ క్రమంలో బాధితులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు. ఎస్ఐ పంపిన డ్రైవర్కు బుధవారం డబ్బులు అందిస్తుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ భాస్కర్ రావు రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆసిఫ్ నగర్కు చెందిన పల్లె సత్యనారాయణ, ఆయన కొడుకు పల్లె వేణుపై లారీ ఫైనాన్స్ విషయంలో(2019 నవంబర్) బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. దీంతో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్ఐ భాస్కర్రావు అప్పటి నుంచి తిప్పించుకుంటున్నాడు. కావాలంటే రూ.2 లక్షల లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.1.20 లక్షలకు అంగీకారం కుదిరింది. ఈ క్రమంలో పల్లె వేణు సోదరుడు పల్లె నవీన్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు బుధవారం ఉదయం పోలీస్స్టేషన్కు వచ్చిన నవీన్ ఎస్ఐని కలిశాడు. పోలీస్టేషన్ పక్కనే ఉన్న తన ప్రైవేట్ డ్రైవర్ రాజ్కుమార్కు ఆ నగదు ఇవ్వాలని ఎస్ఐ సూచించాడు. ముందస్తు సమాచారం మేరకు అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు నగదు తీసుకుంటుండగా రాజ్కుమార్ను పట్టుకున్నారు. వెంటనే ఎస్ఐ, రాజ్కుమార్ను అదుపులోకి తీసుకొని విచారించారు. లంచం డిమాండ్ చేసినట్లు రుజువైందని, ఈ వివరాలను డీఎస్పీ వివరించారు. గురువారం కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు జాన్రెడ్డి, సునీల్, వీందర్, సంజీవ్, తిరుపతి పాల్గొన్నారు.