కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్
పల్లెప్రగతి పనుల పురోగతిపై సమీక్ష
కాగజ్నగర్ రూరల్, జూలై 14 : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం చేరుకునేందుకు బాధ్యతాయుతంగా పనిచేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నాలుగో విడుత పల్లె ప్రగతి పనుల పురోగతిపై కాగజ్నగర్ డివిజన్లోని పంచాయతీ అధికారులు, కార్యదర్శులతో మండలంలోని వంజిరి రైతువేదికలో బుధవారం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని ఏ ఒక్క గ్రామంలోనూ అభివృద్ధి పనులు పూర్తికాలేదన్నారు. అన్ని అసంపూర్తిగానే ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా పని చేయకపోవడంతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగడం లేదన్నారు. కార్యదర్శులు ఉదయాన్నే గ్రామాల్లోకి వెళ్లి పారిశుధ్యం, శానిటేషన్, చెత్తసేకరణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. డివిజన్లోని ఏఒక్క పంచాయతీ కార్యాలయంలో కూడా మరుగుదొడ్డి లేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. గ్రామాల్లో ప్రతి నెలా గ్రామసభలు నిర్వహించాలని, గ్రామాల్లో వచ్చిన అభివృద్ధి పనుల వివరాలను గ్రామ కమిటీ సభ్యులకు తెలియజేసి తీర్మానించాలని సూచించారు.
ప్రగతి పనులు పూర్తి చేయాలి
డివిజన్ పరిధిలో అసంపూర్తిగా ఉన్న పల్లె ప్రగతి పనులు, ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం 100 శాతం పూర్తి చేయాలన్నారు.డివిజన్ పరిధిలోని నర్సరీల్లో 34 లక్షల మొక్కలు పెంచినట్లు తెలిపారు. ప్రతి మొక్క వివరాలు స్పష్టంగా ఉండాలన్నారు. గ్రామైక్య సంఘాల ద్వారా సీడ్ బాల్స్ తయారీకి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో నిత్యం డ్రైనేజీ శుభ్రం, చెత్త తొలగింపు పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు. వారి పని తీరు ఆధారంగా మార్కు లు కేటాయించనున్నట్లు తెలిపారు. 8 మార్కుల కంటే తక్కువగా వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖర్చు చేసిన ప్రతీ పైసా వివరాలను పంచాయతీల్లో బోర్డులు ఏర్పాటు చేసి నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్, డివిజన్ పరిధిలోని ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు