కరోనా కట్టడి కోసం పోలీసుల కఠిన చర్యలు
మాస్కులు పెట్టుకోని వారికి భారీగా జరిమానా
గర్మిళ్ల, జూలై 14 : కరోనా కట్టడికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్ లేకుం డా బయట తిరుగతున్న వారిని ఠాణాకు తర లించి జరిమానా విధిస్తున్నారు. ప్రజలు మాస్కు లు లేకుండా బయట తిరిగితే చర్యలు తప్పవని డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డి అన్నారు. డీసీపీ, ఏసీపీ అఖిల్ మహాజన్ మంచిర్యాలలోని ప్రధాన వీధుల్లో బుధవారం పర్యటించారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని ప్రత్యేక వాహనంలో స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కరోనా మహమ్మారి కారణంగా ఎందరో మృత్యువాత పడ్డారన్నారు. అయినా కొందరిలో ఏమాత్రం మార్పు రావడం లేదన్నారు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందని పదే పదే హెచ్చరిస్తున్నా కొందరు ఏ మాత్రం భయం లేకుండా, మాస్కులు లేకుండా ప్రజల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. ప్రజలు కచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలన్నారు. విస్మరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానాలు విధించి వదిలిపెట్టారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ముత్తి లింగయ్య, ఎస్ఐలు ప్రవీణ్కుమార్, దేవయ్య, కిరణ్కుమార్, ఏఎస్సై వెంకన్న గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.