గిరిపోషణ్ అభియాన్ ద్వారా అందించేందుకు సర్కారు చర్యలు
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రయోజనం
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): అడవి బిడ్డల ఆరోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇటీవల కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాలో సర్వే నిర్వహించి రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించింది. ఈ మేరకు పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, బాలింతలు, గర్భిణుల కోసం గిరిపోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నది. పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
ఆదివాసీ తెగల్లో పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులు, బాలింతలకు రాష్ట్ర ప్రభుత్వం గిరి పోషణ్ పథకం ద్వారా సంపూర్ణ పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టింది. గిరిజనుల్లో తలెత్తుతున్న పోషకాహార సమస్యలపై జాతీయ సంస్థలు సర్వే నిర్వహించాయి. ఆదివాసుల్లో కొలాం, తోటి, చెంచు, కొండారెడ్డి తెగలకు చెందిన చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఎక్కువ మంది రక్తహీనతతో ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్ జిల్లాల్లో 533 ఆవాసాల్లో సర్వే చేపట్టాయి. పిల్లలు వయసుకు తగిన ఎత్తు, బరువు లేకపోవడాన్ని గుర్తించింది. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 12 వేల మంది ఉన్నట్లు గుర్తించింది. రక్తహీనతను నివారించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందకు గిరి పోషణ్ అమలు కోసం గిరిజన సంక్షేమ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయనున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారంతో పాటు గిరి పోషణ్ ద్వారా మరింత పౌష్టికాహారాన్ని అందించనున్నారు. గతంలో అంగన్వాడీల ద్వారా 654 కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు చేశారు.
అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం
బాలింతలు, గర్భిణులు ఆరోగ్యంపై సరైన అవగాహన, ఆర్థిక స్థోమత లేకపోవడంతో అనేక మంది ఇబ్బందులను తీర్చేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఇప్పటికే బలోపేతం చేసింది. ముఖ్యంగా పోషకాహార లోపాన్ని నివారించేందుకు పాలు, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు, బాలామృతం వంటి పదార్థాలను అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్నది. దీనిని గర్భిణులు, బాలింతలు, పిల్లలు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తూ ప్రత్యేకంగా గిరి పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గతంలో జిల్లాలో నిర్వహించిన సర్వేలో తీవ్రమైన పోషకాహార లోపంతో 1174 మంది, సాధారణ పోషకాహార లోపంతో 3425 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి వారికి గిరిపోషణ్ ద్వారా మరిత నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
జిల్లాలో పూర్తిస్థాయి ఏజెన్సీ ప్రాంతాలైన లింగాపూర్, సిర్పూర్(యూ), జైనూర్, కెరమెరి, తిర్యాణి మండలాల్లో ఆదివాసులు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా ఆదివాసీ గ్రామాల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారుల్లో పౌషకాహార లోపం తీవ్రంగా ఉంటుంది. కనీస స్థాయిలో పోషకాహారం తీసుకోకపోవడంతో పాటు పారిశుధ్య లోపం వల్ల ఇతర వ్యాధులు కూడా అధికంగా వస్తున్నాయి. ఇలాంటి సమస్యలను తీర్చేందుకు గిరిజన సంక్షేమ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో గిరి పోషణ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. పట్టణ, మైదాన ప్రాంతాల్లో లభించే వైద్య సదుపాయాల స్థాయిలో ఏజెన్సీ ప్రాంతాల్లో అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.