సింగరేణీయులకు ఫస్ట్ ఎయిడ్పై తర్ఫీదు
అపాయ సమయాల్లో ప్రాణాలు కాపాడుకునే చాన్స్
పెద్దపల్లి జిల్లా ఆర్జీ-2 ఏరియాలో శిక్షణ కేంద్రం ప్రారంభం
శ్రీరాంపూర్, సెప్టెంబర్ 13 :130 ఏండ్లకుపైగా ఘన చరిత్ర కలిగిన సింగరేణి.. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నది. అదేస్ఫూర్తితో దేశంలో ఏ బొగ్గు పరిశ్రమలోనూ లేని విధంగా.. కార్మికులు ప్రాణాపాయ స్థితిలో తమ ప్రాణాలు కాపాడుకోవడానికి, తోటి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడడానికి మొదటి సారి ఫస్ట్ ఎయిడ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. పెద్దపల్లి జిల్లాలోని ఆర్జీ-2 ఏరియాలో గల నర్గుండ్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఎన్ఐఎం) ప్రాంగణంలో ఏర్పాటు చేయగా.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
సేఫ్టీ విభాగం చొరవతో…
దేశంలో సెయింట్ జాన్స్ అంబులెన్స్ సంస్థ మాత్రమే ప్రథమ చికిత్స శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్లు జారీ చేసేది. ఇందుకు సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు ఎంతో వ్యయప్రయాసలతో ఆ సంస్థకు సంబంధించిన కేంద్రాలకు వెళ్లేవారు. పరీక్ష రాసి పాసైన తర్వాత సర్టిఫికెట్ పొందేవారు. కరోనా కారణంగా ఆ సంస్థ శిక్షణను నిలిపివేయడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొవిడ్ వల్ల ఎదురవుతున్న సవాళ్లపై సానుకూలంగా స్పందించి వాటిని అవకాశంగా మలుచుకోవాలన్న సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ మాటలను సేఫ్టీ విభాగం అధికారులు ఆచరణలో పెట్టారు. ప్రథమ చికిత్స శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. రామగుండం ఆర్జీ-2 ఏరియాలోని నర్గుండ్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సెంటర్ను కేంద్ర కార్మిక మంత్రి త్వ శాఖకు చెందిన డీజీఎంఎస్ అధికారులు తనిఖీ చేశారు. అనుమతులు కూడా ఇవ్వడంతో ఇటీవలే ప్రారంభించారు.
ఫస్ట్ ఎయిడ్ శిక్షణ తీరు..
ప్రతి బ్యాచ్లో 30 మంది కార్మికులు, అధికారులకు 10 రోజుల పాటు నిపుణులతో శిక్షణ ఇస్తారు. శిక్షణలో ప్రాక్టికల్స్, థియరీ తరగతులు ఉంటాయి. అనంతరం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ అందిస్తారు. కాగా, ఈ నెలలో మొదటి బ్యాచ్ శిక్షణ మొదలవుతుందని సేఫ్టీ జీఎం గురువయ్య తెలిపారు. మొదటగా ఉద్యోగోన్నతుల జాబితాలో ఉన్న వారికి ప్రాధాన్యమివ్వనున్నారు. కాగా, ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంపై కార్మికులు, అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.25 వేలు మిగులు..
యాజమాన్యం కార్మికులకు కల్పిస్తున్న ఫస్ట్ ఎయి డ్ శిక్షణ కేంద్రం ఎం తో ఉపయోగకరం. గ తంలో కార్మికుడికి ఉద్యోగోన్నతి వచ్చిందంటే కోల్కత, ఢిల్లీ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి, శిక్షణ పొందేవారు. సొంత ఖర్చులతో శిక్షణ తీసుకునేవారికి ఆ తర్వాత యాజమాన్యం ఉద్యోగోన్నతి కల్పించేది. పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్న శ్రీరాంపూర్ ఏరియాలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుండేది. ప్రస్తుతం ఏ ఒక్క కార్మికుడికీ శ్రమ, ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. ఒక్కొక్కరికీ రూ.25వేలు ఆర్థిక లాభం చేకూరుతుంది.