కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
పల్లె ప్రగతిపై అధికారులతో సమీక్ష
ఆసిఫాబాద్,జూలై13 : ఈనెల 23 లోగా పల్లెప్రగతిలో మిగిలిన పనులను పూర్తిచేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని రైతు వేదికలో అధికారులు, ప్రజాప్రతినిధులకు సమన్వయ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో చేపట్టే ప్రతి పనినీ ప్రజల భాగస్వామ్యంతో వారికి తెలిసేలా చొరవ చూపాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలితే ఎలాంటి నోటీసులు లేకుండానే పంచాయతీ కార్యదర్శులను తొలగిస్తామని హెచ్చరించారు. పంచాయతీల్లో ఖర్చుల వివరాలు విడివిడిగా లేవని , ప్రతి ఖర్చుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని సూచించారు. ప్రకృతి వనాలలో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలన్నారు. పంచాయతీలో స్థాయీ సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి ఆమోదం పొందిన తర్వాత నిధులు ఖర్చు చేయాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంప్ యార్డుకు తరలించాలని సూచించారు. సెగ్రిగేషన్ షెడ్లో ఏర్పాటు చేసే మరుగుదొడ్లకు సెప్టిక్ ట్యాంక్ , డ్రైనేజీ కనెక్షన్ ఇవ్వాలన్నారు. దోమల నివారణకు నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేయాలని, చెత్తాచెదారం లేకుండా చూడాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ హ్యబీటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్, డీఆర్డీవో రవికృష్ణ, జడ్పీ సీఈవో రత్నమాల, ట్రైబర్ డీడీ మణెమ్మ, ఎస్సీ సంక్షేమాధికారి సజీవన్, జిల్లా పశు సంరక్షణాధికారి రమేశ్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయ తీ కార్యదర్శులు, శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.