చొప్పదండి, ఏప్రిల్ 13: ప్లవనామ సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని శివకేశవాలయంలో మంగళవారం ఉగాదిని పురస్కరించుకొని ఎమ్మెల్యే కుటుంబసమేతంగా పూజలు చేశారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. వేద పండితులు మురళీశర్మ, సత్తయ్య ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, కరోనా వైరస్ నుంచి ప్రజలు విముక్తి పొందాలని, పంటలు బాగా పండాలని శివ కేశవులను కోరుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రహరీ, కల్యాణ మండపం నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గొల్లపల్లి శ్రావణ్, వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు దూస రాము, నాయకులు రాజనర్సింగరావు, వెంకటరమణారెడ్డి, మచ్చ రమేశ్, గుర్రం మల్లారెడ్డి, గుర్రం రవీందర్రెడ్డి, వివేకానంద యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఉగాది వేడుకలు
మండలంలో ఉగాది వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ప్లవనామ సంవత్సరంలో అంతా శుభాలు కలుగాలని కోరుతూ ప్రజలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణం చేశారు.