సింగరేణి వ్యాప్తంగా ఏర్పాట్లు చేయాలి
రెండు వారాల్లోగా కార్మికులు, ఉద్యోగులందరికీ టీకా పూర్తి
జీఎంలతో వీడియోకాన్ఫరెన్స్లో సీఎండీ శ్రీధర్
శ్రీరాంపూర్, జూన్ 11 : ఉద్యోగులు, కార్మికులకు రెండు వారాల్లోగా టీకా పూర్తిచేయాలని, ఇందుకు సింగరేణి వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని డైరెక్టర్లు, జీఎంలను సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ ఆదేశించారు. ఈ మేరకు 13 నుంచి వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. కరోనా నివారణ చర్యలపై హైదరాబాద్ నుంచి శుక్రవారం సాయంత్రం డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వయసుతో సంబంధం లేకుండా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులందరికీ వ్యాక్సిన్ ఇప్పిస్తామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తకుండా నిరంతరాయంగా బొగ్గు వెలికితీస్తున్న సింగరేణీయులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికే 45 ఏండ్లు పైబడిన 16 వేల మంది ఉద్యోగులు, కార్మికులకు, 14 వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు, 6 వేల మంది విశ్రాంత కార్మికులకు వ్యాక్సిన్ పూర్తయిందని వెల్లడించారు.
మిగతా 29 వేల మంది ఉద్యోగులకు 10 రోజుల్లో మొదటి డోసు అందించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భౌతిక దూరం, కరోనా నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ ఇప్పించేందుకు వీలుగా ఏరియాల్లో కమ్యూనిటీ కేంద్రాలు, డిస్పెన్సరీలు, దవాఖానల్లో ఏర్పాట్లు చేయాలని అన్ని ఏరియాల జీఎంలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్కు వచ్చే ఉద్యోగి విధిగా ఆధార్ కార్డు, కంపెనీ గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. మెగా కొవిడ్ వ్యాక్సిన్కు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సమీక్షా సమావేశంలో డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ మథా శ్రీనివాస్, డాక్టర్లు బాల కోటయ్య, పూర్ణచందర్రావు, శ్రీరాంపూర్ నుంచి జీఎం సురేశ్, ఈఈ కుమార్, డీవైజీఎం గోవిందరాజు, విజయ భాస్కర్రెడ్డి, ఏవీ రెడ్డి, నర్సింహారావు, సేఫ్టీ ఆఫీసర్ గోషిక మల్లేశ్, డీవైసీఎంవో డాక్టర్ విజయలక్ష్మి, హెల్త్ ఆఫీసర్ సుమన్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.