దహెగాం మండలంలో ఏడు కేంద్రాల ఏర్పాటు
3,500 ఎకరాల్లో సాగు n పెరిగిన దిగుబడి
ఇప్పటి వరకు 30 వేల క్వింటాళ్ల సేకరణ
రైతుల హర్షం
దహెగాం, మే 9 : దహెగాం మండలంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే వరి కోతలు పూర్తి కాగా, రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో దహెగాం, లగ్గాం, ఒడ్డుగూడ, గిరివెల్లి, చంద్రపల్లి, కొంచవెల్లి గ్రామాల్లో.., ఐకేపీ ఆధ్వర్యంలో కల్వాడ గ్రామంలో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో రైతులకు అన్ని ఏర్పాట్లు చేశారు. తాగునీరు, టార్పాలిన్లు, గన్నీసంచులు సరిపడా అందుబాటులో ఉంచారు. మండలంలో ఈ యాసంగిలో 3,500 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు రూ.1888 మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోళ్లు చేపడుతున్నారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందో లేదోనని మొదట్లో రైతులు కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కొనుగోలు అన్ని చోట్లా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పోయాయి. అంతేకాకుండా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొనుగోళ్లు చేపడుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టంతో మొదట్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారో లేదోనని ఆందోళన చెందాను. అయితే తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నేను మా ఊర్లోనే 200 క్వింటాళ్ల ధాన్యాన్ని అమ్మిన. చాలా సౌకర్యంగా ఉంది. లేకుంటే వ్యాపారులకు వారు పెట్టిన ధరకే అమ్ముకునే పరిస్థితి ఉండేది. అంతేకాకుండా డబ్బులు కూడా ఒకేసారి వచ్చేవి కావు. సర్కారుకు రుణపడి ఉంటాం.