అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
ప్రతి నియోజకవర్గంలో 1000 నుంచి 1500 మందికి అవకాశం
సర్కారు తీపి కబురుపై సర్వత్రా హర్షం
మంచిర్యాల (నమస్తే తెలంగాణ) / నిర్మల్ టౌన్, అక్టోబర్ 8 :త్వరలో సొంతభూమిలో ఇల్లుకట్టుకునే పథకం ప్రారంభిస్తామని శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రతి నియోజకవర్గంలో 1000 నుంచి 1500 మందికి మంజూరు చేయనుండగా, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయమందించనున్నది. త్వరలోనే విధివిధినాలు ఖరారు చేయనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
సొంతభూమిలో ఇ ల్లు కట్టుకునేవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. సొంత భూమిలో ఇల్లు కట్టుకునే పథకం త్వరలో ప్రారంభిస్తామని సీఎం మరోసారి స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 1000 లేదా 1500 మందికి అవకాశం ఇస్తామని, త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఈ హామీ ఇచ్చామని, కరోనాతో ఆలస్యమైందని పేర్కొన్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో భారీ అవినీతి జరిగిందని, ఇప్పు డు అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు.
ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇండ్లు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కుమ్రంభీం, మంచిర్యాలలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపడుతున్నది. మంచిర్యాల జిల్లాలో రూ.2,416 ఇం డ్లు మంజూరు కాగా, 934 ఇండ్లు పూర్తి కావస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో 6686 ఇండ్లకు పరిపాలన అనుమతులు తీసుకున్నారు. ఇం దులో 33,250 ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా, ఇప్పటికే 2500 పూర్తయినట్లు అధికారులు తెలిపారు. 250 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1400 ఇండ్లు మంజూరు కాగా, నిర్మాణంలో 600 ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 3499 మంజూరు కాగా, 518 పూర్తి చేసి లభ్ధిదారులకు అందజేశారు. మిగతావి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇదిలాఉంటే 2018 లో ఎన్నికల హామీలో భాగంగా సొంత స్థలం ఉన్న నిరుపేదలందరికీ రూ. 5 లక్షలు ఖర్చు చేసి ఇండ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు తాజాగా శుక్రవారం అసెంబ్లీలో ఇండ్ల నిర్మాణంపై చర్చ జరుగగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో సొంత ఇండ్లు లేని కుటుంబాలను గుర్తించామని, వారందరికీ సొంత స్థలముంటే రూ. 5 లక్షలు మంజూరు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు.
నియోజకవర్గానికి 1000 లేదా 1500 వరకు..
సొంత స్థలమున్న నిరుపేదలు ఇండ్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం అందిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ ప్రకటించడంపై సర్వ త్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒ క్కో నియోజకవర్గానికి 1000 లేదా 1500 ఇండ్లను మొదటి విడుతలో మంజూరు చేస్తామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ఖానాపూర్, ముథోల్, ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాలుండగా మొదటి విడుతలో 10 వేల లేదా 15 వే ల ఇండ్లు మంజూరయ్యే అవకాశం ఉంది.
పేదలకు ఉపయోగపడే పథకం
సొంత భూమిలో ఇల్లు కట్టుకోవాలనుకునే నిరుపేదలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి సొంత భూమి ఉన్నా డబ్బు ల్లేక ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం తోడ్పాటును అందిస్తే ఈ పథ కం ద్వారా చాలామందికి లబ్ధి కలుగు తుంది. స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే నాలాంటి వారికి ఈ పథకం వరం లాంటింది.
శేగం లక్ష్మణ్, కోటపల్లి