మృగశిర వేళ.. జోరుగా చేపల విక్రయాలు..
ఇంటింటా మరిగిన చేపల పులుసు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 70 టన్నులకు పైగా అమ్మకాలు
కొనుగోలుదారులతో కిటకిటలాడిన మార్కెట్లు
సర్కారు ఉచితంగా అందించిన చేపపిల్లలతో మత్స్యకారులకు ఉపాధి
కుమ్రం భీం ఆసిఫాబాద్, (నమస్తే తెలంగాణ)/ మంచిర్యాల అర్బన్, జూన్ 8 :మృగశిర కార్తె.. సందర్భంగా చేపల మార్కెట్లు, ప్రధాన కూడళ్లు ప్రజలతో కిటకిటలాడాయి. మత్స్యకారులు సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం పట్టిన చేపలను మార్కెట్లకు తీసుకురాగా, విక్రయాలు ఫుల్గా సాగాయి. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేపలు చేతికందగా, కొన్ని చోట్ల కొనుగోళ్లు చెరువుల వద్దే నడిచాయి. కార్తె రోజున ఒక ముక్కైనా తినాలన్న ఉద్దేశంతో పట్టణ, పల్లె తేడా లేకుండా కొనుగోళ్లకు ఎగబడ్డాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడ ప్రాజెక్టు వద్ద ఉదయం నుంచే హోల్సేల్ సందడి కనిపించింది. మార్కెట్లో రకాన్ని బట్టి రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయాలు జరిగాయి. అలాగే సుమారు 15 నుంచి 20 టన్నుల చేపల విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో.. 10 కిలోల పైన చేపలు సైతం మార్కెట్కు వచ్చాయి. మంచిర్యాల మార్కెట్లో వ్యాపారులు 12.50 కిలోల చేపను అమ్మకానికి ఉంచారు. సాధారణంగా కిలో రూ.150 ఉండగా, కార్తె సందర్భంగా రూ.200 చొప్పున విక్రయాలు జరిపారు. జిల్లాలో సుమారు 25 టన్నుల వరకు చేపల అమ్మకాలు జరిగినట్లు వ్యాపారులు వెల్లడించారు.