సత్ఫలితాలిస్తున్న లాక్డౌన్,జ్వర సర్వే
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 1.60శాతం పాజిటివ్ రేటు
రెండు జిల్లాల్లో రోజూ 4 వేల నిర్ధారణ పరీక్షలు
ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన వైద్యం
ఆదిలాబాద్, జూన్ 4 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా సెకండ్ వేవ్ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. లాక్డౌన్తో పాటు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జ్వర సర్వే చేపట్టింది. అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. సూపర్ స్ప్రెడర్లు, ఆర్టీసీ సిబ్బందికి సైతం టీకాలు వేస్తున్నారు. కరోనా నియంత్రణకు సర్కారు చేపట్టిన చర్యలు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంచి ఫలితాలు ఇస్తున్నాయి. రెండు జిల్లాల్లో మే మొదటి వారంలో కరోనా పాజిటివ్ రేటు 15 శాతం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కారణంగా రెండో వారం నుంచి పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం రెండు జిల్లాల్లో 1.6 పాజిటివ్ రేటు ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. కరోనా నివారణలో భాగంగా ప్రజలు తమ వంతు సాయం అందిస్తున్నారు. సడలింపు సమయంలోనే పనులన్నీ ముగించుకొని లాక్డౌన్ నిర్దేశిత సమయానికి ఇళ్లకు చేరుకుంటున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారు సమీపంలో సర్కారు దవాఖానలకు వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. పాజిటివ్ వచ్చిన వారు వైద్యులు ఇచ్చిన మందులను వాడుతూ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పకడ్బందీ చర్యలు
కరోనా నియంత్రణకు అధికారులు రెండు జిల్లాల్లో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ను పక్కాగా అమలు చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వైద్యశాఖ అధికారులు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని తిప్పి పంపుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రోజూ 4 వేల వరకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ కేసులకు సత్వరమే వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జ్వర సర్వే సత్ఫలితాలనిస్తున్నది. సర్వేలో భాగంగా పట్టణాలు గ్రామాల్లో ఇంటింటా పర్యటించిన వైద్యబృందాలు లక్షణాలు ఉన్న వారికి కిట్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రజలకు ప్రాథమిక దశలోనే వైద్య సేవలు అందుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వైద్యశాఖ అధికారులు ఇప్పటికే మూడు విడుతలుగా సర్వే నిర్వహించారు. రెండు జిల్లాల్లో కరోనా కేసులు తగ్గాయని ప్రజలు వైరస్ నియంత్రణకు తమ సహకారం అందించాలని అధికారులు కోరుతున్నారు.
సర్వే కొనసాగుతున్నది
ఆదిలాబాద్ జిల్లాలో జర్వ సర్వే కొనసాగిస్తున్నాం. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారికి మందులు పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రజలకు ప్రాథమిక దశలోనే వైద్యం అందుతుంది. జిల్లాలో రోజు 1800 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించి వైరస్ నియంత్రణకు సహకరించాలి.
నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి, ఆదిలాబాద్