జాతీయ రహదారి వెంటే నిర్ధారణ పరీక్షలు
ప్రయాణికులను ఆపి పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులు
సింగరేణిలో వైరస్ లింక్ తొలగించేందుకు చర్యలు
సీసీసీ నస్పూర్, జూన్ 3 : కోల్బెల్ట్ ప్రాంతమైన నస్పూర్లో కరోనా కట్టడికి పోలీసులు కరోనా మొబైల్ పరీక్షలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, ఇక్కడ తగ్గడంలేదు. సింగరేణి కార్మికుల కాలనీల్లో ఎక్కువగానే నమోదవుతున్నాయి. భూగర్భ గనుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించి పనులు చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేసుల సంఖ్య ఎక్కువగానే నమోదవుతుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన అధికారులు, చైన్ లింకును తొలగించడానికి చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో విస్తృతంగా టెస్టులు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్తో చర్చించారు. మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి ఆదేశాలతో గురువారం సీసీసీ నస్పూర్ పోలీసులు రహదారిపై కొవిడ్ నిర్ధారణ మొబైల్ పరీక్షలు ప్రారంభించారు. సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బందితో వాహనదారులను ఆపి కరోనా పరీక్షలు చేశారు. మంచిర్యాల ఆర్బీఎస్కే మొబైల్ టెస్ట్ నిర్వాహకులు డాక్టర్ పద్మశ్రీ, టెక్నీషియన్లు సావిత్రీ, వసంత పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సింగరేణి ప్రాంతమైన నస్పూర్లో కరోనా చైన్ లింకును తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. లాక్డౌన్ ముగింపులోగా సింగరేణి ప్రాంతంలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పారు. నస్పూర్ పీహెచ్సీ, సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలతో పాటు, వాహనదారులకు టెస్టులు కొనసాగుతాయని పేర్కొన్నారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఇమామొద్దీన్, కానిస్టేబుళ్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.