జైపూర్, జూన్ 3 : జైపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందారం క్రాస్రోడ్డు వద్ద గురువారం మూడు లక్షల రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలను రామగుండం టాస్క్ఫోర్స్, జైపూర్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ ఏకే మహేందర్, జైపూర్ ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..రామగుండం కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం ఇందారం క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించిన తనిఖీల్లో మూడు లక్షల విలువగల నిషేధిత పత్తి విత్తనాలు పట్టుకున్నారు. గుంటూరుకు చెందిన అద్దంకి నాగేశ్వర్రావు సహయంతో హైటెక్ సిటీ మంచిర్యాలకు చెందిన మాకినేని రాఘవేంద్ర, మంచిర్యాల సంజీవయ్య కాలనీకి చెందిన పులికొండ యశ్వంత్ ఆటోలో జనుముల సంచుల కింద పత్తి విత్తనాలను చెన్నూర్వైపు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు మంచిర్యాలకు చెందిన వీరిని అదుపులోకి తీసుకోగా గుంటూర్కు చెందిన నాగేశ్వర్రావు పరారీలో ఉన్నారు. నిషేధిత పత్తి విత్తనాలు, గడ్డి మందులు కూడా ఆంధ్రా ప్రాంతం నుంచి తరలించి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. లాక్డౌన్ సడలింపు వేళల్లో వీటిని తరలిస్తున్నారని తెలిపారు. ఈ తనిఖీల్లో సిబ్బంది సదానందంగౌడ్, వెంకటేశ్, భాస్కర్గౌడ్, సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్
కోటపల్లి, జూన్ 3 : నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ అమలు చేయనున్నట్లు చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు హెచ్చరించారు. కోటపల్లి, సర్వాయిపేట గ్రామాల్లోలోని విత్తన విక్రయాల దుకాణాలను చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు, తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్పాండే, ఏవో మహేందర్, ఎస్ఐ రవి కుమార్ తనిఖీ చేసి గోదాముల్లో నిల్వలను పరిశీలించారు. నకిలీ పత్తివిత్తనాలు విక్రయించినా, నిల్వ చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
కాసిపేట, జూన్ 3 : మండల కేంద్రంలోని విత్తన, ఎరువుల దుకాణాల్లో కాసిపేట ఎస్ఐ కే నరేశ్, మండల వ్యవసాయాధికారిని దేవులపల్లి వందన, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. రికార్డులను, స్టాక్ను పరిశీలించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్ఐ నరేశ్ హెచ్చరించారు.