కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్
గుస్సాడీ కనకరాజుకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సక్కుతో కలిసి పింఛన్ పత్రాల అందజేత
ఆసిఫాబాద్ టౌన్, జూన్ 2 : ఆదివాసుల గుస్సాడీ నృత్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ఘనత పద్మశ్రీ కనకరాజుకు దక్కిందని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఇందులో భాగంగా ఆయనకు తెలంగాణ సర్కారు ప్రతి నెలా రూ.10 వేల పింఛన్ మంజూరు చేయగా, సంబంధిత పత్రాలను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి కలెక్టరేట్లో కనకరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పద్మశ్రీ అవార్డు జిల్లాకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. గుస్సాడీ కనకరాజును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కనకరాజుకు ప్రతి నెలా రూ.10వేలు పింఛన్ మంజూరు చేసిందన్నారు. ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కనకరాజు కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.