మణుగూరు రూరల్, డిసెంబర్ 6: రైల్వే ట్రాక్ పనుల్లో వేగం పెంచాలని టీఎస్ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు సూచించారు. బీటీపీఎస్ పనుల పరిశీలన కోసం సోమవారం మణుగూరు వచ్చిన ఆయన.. తొలుత రైల్వేట్రాక్ పనులను పరిశీలించారు. జాప్యం లేకుండా అనుమతులను పొందాలని, వేగంగా పూర్తిచేయాలని సూచించారు. రైల్వేట్రాక్ విస్తరణలో భాగంగా ఆటంకంగా ఉన్న 400 కేవీ, 220 కేవీ లైన్లను మార్చి క్లియరెన్స్ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం యాష్పాండ్కు ఇబ్బందులు కలుగుకుండా పేరంటాల చెరువు నాళా డైవర్షన్ కోసం చర్యలు తీసుకోవాలని, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో నీటి మళ్లింపుపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మార్షలింగ్ యార్డులో పనులు నిలిచిపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ను వివరాలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. తగిన నివేదికతో అధికారులు వారంలోగా ప్రధాన కార్యాలయానికి రావాలని ఆదేశించారు.
అనంతరం కోల్ప్లాంట్, వ్యాగన్ లోడింగ్ ప్రక్రియను, 4వ యూనిట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులతో సమావేశమై విభాగాల వారీగా పనుల పురోగతిపై చర్చించారు. రామానుజవరం ఇన్టేక్ వెల్ను పరిశీలించి శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డైరెక్టర్ (సివిల్) అజయ్కుమార్, డైరెక్టర్ (ప్రాజెక్ట్) సచ్చిదానందం, బీటీపీఎస్ సీఈ బాలరాజు, జెన్కో ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.
మణుగూరు పర్యటనకు వచ్చిన జెన్కో, ట్రాన్స్కో ఎండీ ప్రభాకర్రావును సింగరేణి ఏరియా జీఎం జక్కం రమేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
బీటీపీఎస్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల్లో ఆరోగ్యం బాగా లేనివారిని కేటీపీఎస్కు బదిలీ చేయాలని కార్మిక సంఘం-1535 సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు ఎంఏ వజీర్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, జెన్కో అధ్యక్షుడు రాములు జెన్కో సీఎండీని కోరారు. ఆస్పత్రి ఏర్పాటు, సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతి తదితర సమస్య పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు.