తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది.. నిరుద్యోగుల ప్రిపరేషన్ యాత్ర ప్రారంభమైంది.. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో యువతీ యువకులు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు.. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసిన తర్వాత భద్రాద్రి జిల్లాలో పదుల సంఖ్యలో కోచింగ్ సెంటర్లు వెలిశాయి.. మరోవైపు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు.. ‘ఉద్యోగ’మస్తు అంటూ యువతకు అండగా నిలవనున్నారు..
– భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 22 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు చెందిన నిరుద్యోగులకు ఇది ఉద్యోగ నామ సంవత్సరం అని చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ ఒకేసారి 80 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. భద్రాద్రి జిల్లా పరిధిలోని 1,316 జిల్లాస్థాయి పోస్టులు, జోనల్ స్థాయిలో 2,160 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటుతో 95శాతం స్థానికులకే దక్కే అవకాశం ఉండడంతో యువత హర్షం వ్యక్తం చేస్తున్నది.
యువత కొలువులు సాధించేందుకు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వమూ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నది. ఇప్పటికే బీసీ,ఎస్సీ, సంక్షేమ అధికారులు నిర్వహణపై కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సైతం పంపించారు. ప్రభుత్వ గ్రంథాలయాల్లోనూ నాణ్యమైన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారితో గ్రంథాలయాలూ కిటకిటలాడుతున్నాయి.
కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ కారణంగా రెండేళ్లుగా కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా కేసులు లేకపోవడం, ఇంతలోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేయడంతో మూతపడిన కోచింగ్ సెంటర్లన్నీ తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా మరో 20 పైగా కోచింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. నిర్వాహకులు మంచి ఫ్యాకల్టీని తీసుకువచ్చి ఉత్తమ బోధన అందిస్తున్నారు. డైలీ టెస్టులు, మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రామాణిక స్టడీ మెటీరియల్ అందిస్తున్నాయి. అభ్యర్థులు ఎక్కువ ఫీజు చెల్లించడానికి సిద్ధపడి మంచి కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. కొందరైతే హైదరాబాద్లోని ప్రముఖ కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. మరికొందరు తాము చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలను పక్కన పెట్టిమరీ కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. ఈసారి జిల్లావ్యాప్తంగా 20 వేల మందికి పైగా పోటీ పరీక్షలు రాసే అవకాశం ఉందని ఓ అంచనా. నిన్నమొన్నటి వరకు నోటిఫికేషన్లు విడుదలవుతాయో లేదో అనే మీమాంసలో ఉన్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ ప్రకటన ఊరటనిచ్చింది.
ప్రణాళిక సిద్ధం చేసుకుని పట్టుదలతో చదివితే జాబ్ పక్కా అని నిపుణులు సూచిస్తున్నారు. ఏది దొరికితే అది చదవడం కాకుండా సిలబస్ ప్రకారం చదివితే ప్రయోజనం ఉంటుందంటున్నారు. రోజువారీగా దినపత్రికలు చదివి కరెంట్ అఫైర్స్ తెలుసుకుని నోట్ చేసుకోవాలని, ప్రిపరేషన్కు ప్రామాణిక పుస్తకాలను అధ్యయనం చేయాలంటున్నారు. ఈసారి వయో పరిమితి పెంచిన నేపథ్యంలో లక్షాలాది మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదివి రివిజన్ చేసుకునేలా ఉంటే కొలువు సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నా రు. మాక్ టెస్టులు రాస్తూ ఉండాలని, తద్వారా అభ్యర్థులు తమ ను తాము అంచనా వేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
సీఎం కేసీఆర్ సరైన సమయంలో కొలువుల భర్తీపై కీలక ప్రకటన చేశారు. నేను ఎస్సై కొలువు సాధించేందుకు ప్రిపేర్ అవుతున్నాను. కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95శాతం ఉద్యోగాలు వస్తాయి. ఈసారి లోకల్ అభ్యర్థులకు మంచి అవకాశం. నోటిఫికేషన్ల విడుదల చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – తాండ్ర మాధవ కృష్ణ, కొత్తగూడెం
నేను 2018లో సీడీపీవో జాబ్ సా ధించా. ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేయనున్న నోటిఫికేషన్లో తప్పకుండా ఇంకా మంచి ఉద్యో గం సాధిస్తాను. ప్రభుత్వ వేలాది కొలువులను భర్తీ చేయనున్నది. నిరుద్యోగులకు ఇది సువర్ణావకా శం. అభ్యర్థులు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. రోజుకు కనీసం8 గంటల పాటు చదవాలి. కోచింగ్ సెంటర్లకు పరీక్ష విధానం తెలుసుకోవడానికి, మాక్ టెస్టులు రాయడానికి వినియోగించుకోవాలి. పూర్తిగా వాటి మీదే ఆధారపడకూడదు. కొత్తగా ప్రిపేర్ అయ్యేవారికి మాత్ర కోచింగ్ ఉపయోగపడుతుంది. పకడ్బందీగా చదివితే కొలువు సులువే.
– కె.రేవతి, సీడీపీవో, దమ్మపేట