ఖమ్మం : మిర్చి సాగు చేస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో నర్సరీ యజమానులకు నర్సరీల క్రమబద్దీకరణ నిబంధనలు -మిరప నారు పెంపకంపై ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి అవగాహన సదస్సుకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.
మిర్చి, పత్తి, వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలబడిందని, నాణ్యత, ఉత్పత్తిలో దేశంలో నంబర్ వన్గా ఉన్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పండే మిర్చిలో 41 శాతం మన దేశంలోనే పండుతుందన్న గుర్తుచేశారు. తెలంగాణ మిర్చి నాణ్యత తెలుసుకుని చైనా వాళ్లు ఖమ్మంలో ప్లాంట్ ఏర్పాటు చేసి ఏడాదికి 2.5 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా మిర్చికి పెరుగుతున్న డిమాండ్ గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. మిర్చి నర్సరీల యజమానులు నాణ్యతా ప్రమాణాల్లో రాజీపడొద్దని సూచించారు. మిర్చి విత్తనం, మిర్చి మొక్కల మీద ఆజమాయిషి ఒకేశాఖ కిందకు తీసుకువస్తామన్నారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఉద్యానశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వేరుశనగ సాగును తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున పెంచాలని, పీనట్ బట్టర్కు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు. రైతులను విభిన్న పంటల సాగు వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, జిల్లాల వారీగా భారీ సదస్సులతో రైతులను చైతన్యం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.60 వేల కోట్లు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఖర్చు పెడుతుందన్నారు.
రైతులను చైతన్యం చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించిందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరల కోసమే మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశామని, సాగులో ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించాలని రైతులకు సూచించారు. రైతులు మనసుపెట్టి వ్యవసాయం చేస్తే వ్యవసాయ రంగంలో ఉన్న సంపద మరే రంగంలో ఉండబోదన్నారు.