సత్తుపల్లి: నూతన వ్యవసాయ చట్టాల పేరుతో కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆదుకుంటుంటే, మరో పక్క మోడీ ప్రభుత్వం రైతులను కుంగదీస్తుందని ఆయన విమర్శించారు. గురువారం స్థానిక న్యూడెమోక్రసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నల్లచట్టాలను తీసుకొచ్చి, రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేకుండా కార్పొరేట్ సంస్థలకు రైతులను తాకట్టు పెట్టే విధంగా పనిచేస్తుందని విమర్శించారు.
రైతులు ఏ పంట వేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతులు పంటలు పండక, విద్యుత్ లేక ఆర్ధికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునేవారని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత విద్యుత్ 24 గంటల పాటు కల్పించి రైతులకు పంట పెట్టుబడిగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. రైతుల జీవితాలను కళ్ళకు కట్టినట్లు రైతన్న సినిమాను తెరకెక్కించానని, రైతులు ఈ సినిమా చూసి తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐ నాయకులు కూకలకుంట రవి, మోరంపూడి పాండు, తడికమళ్ళ యోబు, అమర్లపూడి రాము, శరత్, రామకృష్ణ, రాజబాబు తదితరులున్నారు.