ఖమ్మం: గణేష్ నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, మేయర్ నీరజతో కలిసి నగరంలోని ప్రకాశ్నగర్, కాల్వోడ్డు మున్నేరు ప్రాంతాలలో గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించారు. నిమజ్జన ప్రదేశాలలో లైటింగ్, బారికేడ్ల ఏర్పాటు, క్రేన్లు, ప్రత్యామ్నాయ విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లపై రూపొందించిన ప్రత్యేక మ్యాప్ను పోలీస్ కమిషనర్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నిమజ్జన ప్రదేశానికి వినాయక విగ్రహాలు నిర్ధేశించిన రూట్ల ద్వారా చేరుకునేలా ట్రాఫిక్ నియంత్రణ ఉండాలని నిమజ్జన ప్రాంతాలలో అనుభవజ్ఞు లైన గజ ఈతగాళ్లను ఉంచాలని నిమజ్జనానికి వచ్చే భక్తులకు తాగునీటితో పాటు ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ స్నేహలత మొగిలి, నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరి, ఆర్డీవో రంవీంద్రనాధ్, ఏసీపీలు రామోజీ రమేష్, ఆంజనేయులు, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.