కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మారుమూలనున్న చిన్న పల్లె… కొత్తకమలాపురం…. ఇక్కడ అన్నీ వ్యవసాయం మీదనే ఆధారపడి జీవించే కుటుంబాలే…. ఎక్కువ మంది తల్లిదండ్రులు పెద్దగా చదువుకోక పోయినా పిల్లల చదువుపై దృష్టి సారించారు. ఈ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివిన వారే…ఇక్కడ కష్టపడి ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు సాధించారు. గ్రామం నుంచి మొదటగా విదేశాలకు వెళ్ళిన ఒకరిద్దిరిని స్పూర్తిగా తీసుకుని గ్రామానికి చెందిన 30మంది యువకులు విదేశాల్లో సాప్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడి ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కేవలం విద్యతోనే తాము ఉన్నత స్థాయికి ఎదిగాము కాబట్టి కన్నతల్లిలాంటి పుట్టిన ఊరుకు, చదువుకున్న పాఠశాలకు ఏదొకటి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రవాస భారతీయులంతా “ఉయ్కేర్” పేరుతో ఓ గ్రూపును ఏర్పాటు చేసుకొని మూడేండ్లు గా గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కొత్తకమలాపురంలోని విద్యార్థులకు మెరుగైన ప్రాథమిక విద్యను అందించి గ్రామంలో చదువుకుంటున్నపేద విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు వారి పిల్లలను కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనే కలను సాకారం చేయడానికి “ఉయ్కేర్” గ్రూప్ తలపెట్టిన కార్యక్రమం మంచి ఫలితాలిస్తుంది. ఈ గ్రామంలోని పేద విద్యార్థులకు చేయూతనివ్వడంతో పాటు కొత్తకమలాపురం ఎన్ఆర్ఐలు చేపట్టిన కార్యక్రమం మిగతా గ్రామాలకు చెందిన యువకుల్లో స్పూర్తి నింపుతున్నది.
కొత్తకమలాపురం గ్రామంలో 272 కుటుంబాలు ఉండగా 689మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామం నుంచి 13ఏండ్ల క్రితం రేపాల సురేష్తో పాటు మరికొందరు యువకులు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. విదేశాలకు వెళ్ళిన వారు ఆర్థికంగా స్థిరపడటంతో వారిని స్పూర్తిగా తీసుకున్న గ్రామానికి చెందిన యువకులు మొత్తం 30మంది ఆరు దేశాలకు వెళ్ళి అక్కడే సాప్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఈ 30మంది ప్రవాసభారతీయుల్లో19మంది “ఉయ్కేర్ “గ్రూప్గా ఏర్పడి కొత్తకమలాపురంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిలో మండెపుడి వెంకట్, వడ్డె ఉదయ్, వడ్డె సంపత్, రేపాల సురేష్, రేపాల సతీష్, దూదిపాళ్ళ విజయ్, నున్నా వెంకటేశ్వర్లు, చాగంటి సతీష్, చాగంటి శివ, చాగంటి కిరణ్, చాగంటి కార్తీక్, చాగంటి గోపి, చాగంటి లక్ష్మినారాయణ, గమిడి హరీష్, గమిడి అనీల్, గమిడి వేణు, కేతారపు రాయకృష్ణ, నాగండ్ల శేఖర్, ఆళ్ళ ఉపేందర్ వీరంతా ఉయ్కేర్ గ్రూపులో సభ్యులుగా ఉండి సేవాకార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తున్నారు.
కొత్తకమలాపురం గ్రామం విదేశీయానంతో పాటు వ్యవసాయ పరంగా కూడా మిర్చి ఎక్కువగా పండించే గ్రామంగా కారేపల్లి మండలంలో పేనున్నది. దీంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీరావు (మల్లెల వెంకటేశ్వరరావు)ది కూడా ఇదే గ్రామం. ఓ ప్రధాన పత్రికకు దేశ రాజధాని ఢిల్లీ వార్తలందిస్తున్న ప్రతినిధి దూదిపాళ్ళ విజయ్ కుమార్ కూడా ఈ గ్రామానికి చెందిన యువకుడే.
మెరుగైన విద్యను అందించటం ద్వారా విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఆంగ్ల భాషలో కూడా నైపుణ్యం పెంచడంతో ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు ప్రయివేటు స్కూల్స్లో చదివిన విద్యార్థులతో పోటీగా అన్నిరంగాల్లో రాణించడానికి పేద విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉయ్కేర్ కార్యక్రమాన్ని చేపట్టాము. ఉన్నతమైన చదువుల ద్వారానే ఆర్థిక స్వాలంభన కలిగి ఆ కుటుంబ అభివృద్ధి, గ్రామాభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి కూడా సహకరించగలం అనే నమ్మకంతో గ్రూప్ సభ్యులమంతా కలిసి మొదటి ప్రాధాన్యతగా పాఠశాల అభివృద్ధికే శ్రీకారం చుట్టాం. నేను కొత్తకమలాపురం ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదివాను. ఉయ్కేర్ గ్రూప్ చేపట్టిన కార్యక్రమం మరెన్నో గ్రామాలకు స్పూర్తిదాయకం కావాలి.
కొత్తకమలాపురం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే దిశగా ఉయ్కేర్ గ్రూప్ వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇది కేవలం ఒక పాఠశాలతోనే ఆగకుండా భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలను గ్రామంలో చేపట్టే విధంగా గ్రామస్తుల సహకారంతో కార్యక్రమాలు రూపొందిస్తాం. పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులకు వెళ్ళే విధంగా ప్రాథమిక దశలోనే ఆ వైపుకు అడుగులు వేసేలా “ఉయ్కేర్” గ్రూప్ సభ్యులంతా చేయూతనిస్తున్నారు. కొత్తకమలాపురం గ్రామంలో సామాజిక చైతన్యంతో పాటు పేదరిక నిర్మూలన కూడా జరగాలనే లక్ష్యంతో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం.