ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం), గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సంయుక్తంగా ‘కస్టమర్ హైరింగ్ కేంద్రాలు’ ఏర్పాటు చేస్తున్నాయి. వీటి ద్వారా రైతులకు తక్కువ అద్దెకు ఆధునిక సాగు యంత్రాలు ఇస్తున్నాయి. అద్దె కేంద్రం నిర్వహణను మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం చూసుకుంటున్నది. కేంద్రం పరిధిలో ఒక మేనేజర్, డ్రైవర్ ఉంటారు. వీరికి ప్రతి నెలా వేతనం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రాన్ని జిల్లా స్థాయిలో డీపీఎం పర్యవేక్షిస్తారు. కారేపల్లి మండలం విశ్వనాథపల్లి కేంద్రానికి ‘అన్నదాత కస్టమర్ హైరింగ్ సెంటర్’కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఎన్ని కేంద్రాలు ఉన్నాయి..? వాటి నిర్వహణ తీరు, ఏ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి? వాటి అద్దెల వివరాలతో ‘నమస్తే తెలంగాణ’ కథనం.
మామిళ్లగూడెం, సెప్టెంబర్ 22: మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి, సభ్యులు ఆర్థిక ప్రగతి సాధించేందుకు జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం), గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సంయుక్తంగా ‘కస్టమర్ హైరింగ్ కేంద్రాలు’ ఏర్పాటు చేస్తున్నాయి. కేంద్రాల ద్వారా స్థానిక రైతులకు తక్కువ అద్దెకు ఆధునిక సాగు యంత్రాలు ఇస్తున్నాయి. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం విశ్వనాథపల్లికి చెందిన సిరివెన్నెల మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘానికి రూ.25 లక్షలతో 15 రకాల యంత్రాలు సమకూరాయి. ఈ కేంద్రం ప్రస్తుతం మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. సాగు యంత్రాలు స్థానికంగానే తక్కువ ధరకు అద్దెకు లభిస్తుండడంతో రైతులు ఈ కేంద్రాలకు వస్తున్నారు. మరోవైపు మహిళా సంఘాల సభ్యులకూ ఆదాయం లభిస్తున్నది. సంఘంలో సభ్యులైతే ఇంకా తక్కువ అద్దెకు యంత్రాలు లభిస్తున్నాయి. అద్దెకు ఇచ్చే విషయంలో స్వశక్తి సంఘాల సభ్యులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. కారేపల్లి మండలంలో 68 స్వయం సహాయక సంఘాలు ఉండగా వీటిలో సభ్యులకు అతి తక్కువ ధరకే యంత్రాలు అద్దెకు లభిస్తున్నాయి.
ఆదాయం ఇలా..
అద్దె కేంద్రం నిర్వహణను రైతు ఉత్పత్తిదారుల సంఘం చూసుకుంటుంది. కేంద్రం పరిధిలో ఒక మేనేజర్, డ్రైవర్ ఉంటారు. వీరికి ప్రతి నెలా వేతనం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రాన్ని జిల్లా స్థాయిలో డీపీఎం పర్యవేక్షిస్తారు. బోనకల్ మండలంలోని ‘స్నేహాంజలి కస్టమర్ హైరింగ్ సెంటర్’ నుంచి రూ.5,82,405 ఆదాయం లభించింది. వచ్చిన కిరాయిలో ఖర్చులు రూ.2, 75,320 పోను మిగిలిన మొత్తం సంఘం ఆదాయాన్ని ఆర్జించింది. కూసుమంచి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ‘స్వశక్తి కస్టమర్ హైరింగ్ సెంటర్’ ద్వారా (37 రోజులకు) మొత్తం రూ.79,030 ఆదాయం వచ్చింది. వీటిలో రూ.47,550 ఖర్చులు పోను మిగిలిన మొత్తం సంఘానికి ఆదాయం వచ్చింది. కారేపల్లి మండలంలో నిర్వహిస్తున్న ‘అన్నదాత కస్టమర్ హైరింగ్ సెంటర్’ ద్వారా (161 రోజులకు) రూ.6, 04,123 ఆదాయం వచ్చింది. వీటిలో రూ.2, 11,700 పోను మిగతా మొత్తం ఆదాయం వచ్చింది.రఘునాథపాలెం కేంద్రంలో నిర్వహిస్తున్న ‘స్వేచ్ఛ మండల మహిళా సమాఖ్య కస్టమర్ హైరింగ్ సెంటర్’ ద్వారా (61 రోజులకు) గాను రూ.2,93,032 ఆదాయం వచ్చింది. ఖర్చులు రూ.15,2038 పోను మిగతా మొత్తం సంఘానికి ఆదాయం లభించింది. వేంసూరు మండలంలోని ‘రైతు నేస్తం కస్టమర్ హైరింగ్ సెంటర్’ ద్వారా (30 రోజులకు) రూ.80,340 ఆదాయం లభించింది. వీటిలో ఖర్చులు రూ.2,700 పోను మిగతా మొత్తం సంఘానికి అదాయంగా లభించింది.
జాతీయ స్థాయిలో గుర్తింపు..
జిల్లాలోని కారేపల్లి మండలం విశ్వనాథపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసిన ‘అన్నదాత కస్టమర్ హైరింగ్ సెంటర్’కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ తన వెబ్సైట్లో ‘75 -ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఆఫ్ ఆత్మనిర్భర్ రూరల్ ఉమెన్’ అనే జర్నల్స్లో ఖమ్మం జిల్లాలోని విశ్వనాథపల్లి కేంద్రం సాధించిన ప్రగతిని ప్రచురించింది. ‘ఎకనామికల్లీ వైయబుల్ ఉమెన్ ఫ్రెండ్లీ కస్టమర్ హైరింగ్ సెంటర్’ ద్వారా సంఘం ఆర్జిస్తున్న ఆదాయం గురించి విశేషంగా చాటిచెప్పింది.
రైతులకు పూర్తి సహకారం
ప్రభుత్వ ప్రోత్సాహంతో కస్టమర్ హైరింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాం. రైతులకు పూర్తిగా సహకరిస్తున్నాం. అతి తక్కువ కిరాయికి ఇస్తున్నాం. సెంటర్ ఏర్పాటు చేసిన కొద్దినెలలు అయినా మంచి ఆదాయం వస్తున్నది. జిల్లాలో విజయంతంగా సెంటర్ నిర్వహిస్తున్నాం. మాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినందుకు ఆనందంగా ఉంది.
-వడ్డె మాధవి, కస్టమర్ ,హైరింగ్ సెంటర్ మేనేజర్, కారేపల్లి
తక్కువ కిరాయికే..
గ్రామంలోని కేంద్రం నుంచి మేం గొర్రు సెట్లు, విత్తనాలు వెదజల్లే యంత్రం, కలుపు నివారణ పిచికారీ యంత్రాలను అద్దెకు తీసుకుంటున్నాం. నేను సంఘం సభ్యురాలిని కావడంతో నాకు మార్కెట్ ధర కంటే తక్కువకే యంత్రాలు అద్దెకు లభిస్తున్నాయి. దీంతో పంటలకు పెట్టుబడి ఖర్చు తగ్గింది.
-హలావత్ ఇందిరాజ్యోతి, సర్పంచ్, విశ్వనాథపల్లి
సంఘాలను ప్రోత్సహిస్తున్నాం..
జిల్లాలో కస్టమర్ హైరింగ్ సెంటర్లు చాలా విజయవంతంగా పని చేస్తున్నాయి. వీటి ద్వారా ఆయా మహిళా సమాఖ్యలకు మంచి ఆదాయం లభిస్తున్నది. మరికొన్ని మండలాల్లో ఇదే తరహాలో కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మహిళా సంఘాలు స్థిరమైన ఆదాయం సాధించేందుకు కృషి చేస్తున్నాం. కేంద్రాలకు జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని సంఘాలను ముందుకు తీసుకుపోతాం.
-ఎం.విద్యాచందన, డీఆర్డీవో, ఖమ్మం