కొత్తగూడెం, సెప్టెంబర్ 22: రాత్రి సమయాల్లోనూ విధుల నిర్వహణకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, తనిఖీలు నిర్వహించే వరకూ పరిస్థితి తెచ్చుకోవద్దని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్.. వైద్యాధికారులకు సూచించారు. వైద్య సేవల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనపై వైద్యులు, స్పెషలిస్టు వైద్యులు, సిబ్బందితో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వైద్య వృత్తిలో అనుభవజ్ఞులైన మీరు సమయపాలన పాటించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. అత్యవసర చికిత్సల నిర్వహణకు ప్రత్యేక వైద్యులు అందుబాటులో లేకపోవడం అనే సమస్య ఉత్పన్నం కావొద్దని సూచించారు. రామవరంలోని 100 బెడ్ల ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రధాన రహదారి నుంచి ఆస్పత్రి వరకు సీసీ రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అక్టోబర్ 10 నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆస్పత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరరావు, సూపరింటెండెంట్ డాక్టర్ సరళి, ఆర్ఐవో రవిబాబు, భద్రాచలం ఆస్పత్రి పర్యవేక్షకుడు రామకృష్ణ, సుజాత పాల్గొన్నారు.
సౌకర్యాలు కల్పించాలి
నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయాలకు విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి డీఆర్వో, పంచాయతీరాజ్, గిరిజన ఇంజినీరింగ్ విభాగం, విద్యుత్, డీఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. డీఆర్వో అశోక్ చక్రవర్తి, పీఆర్ ఈఈ సుధాకర్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ రాములు, విద్యుత్ ఎస్ఈ సురేందర్, మున్సిపల్ కమిషనర్లు సంపత్కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు.