ఇల్లెందు, సెప్టెంబర్ 21: వారిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు. అమ్మాయి అందం అబద్దమాడించింది. ఆ యువకుడు అమ్మాయి వెంటపడ్డాడు. వరసకు బావనవుతానంటూ నమ్మించాడు. ఇంటి పేరు మార్చి అమ్మాయికి చెప్పాడు. ఆ అమ్మాయి నమ్మింది. ప్రేమలో పడింది. కొద్దిరోజులకే పెళ్లిదాక వెళ్లింది. పెద్దలకు తెలిస్తే.. ఒప్పుకోరని ఓ నిర్ణయానికి వచ్చారు. ఎవరికీ తెలియకుండా హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫొటోలు అమ్మాయి స్నేహితుల ద్వారా వారి తల్లిదండ్రులకు చేరాయి. ఇంటికొచ్చిన అమ్మాయిని వరుసకు అన్నయ్య అయ్యేవాణ్ని ఎలా పెళ్లి చేసుకున్నావంటూ మందలించారు.
‘నేను పెళ్లి చేసుకున్నది అన్నయ్య వరసయ్యే వ్యక్తినా?’ అనుకుంటూ మనోవేదన చెందింది. బంధువులు, తల్లిదండ్రులు మందలించడంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఆ యువకుడు పురుగుమందు తాగి ఇంట్లో ఉన్న బావిలోకి దూకాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలంలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం..
ఇల్లెందు మండలం కట్టుగూడెంకు చెందిన బోడ శ్వేత (21) హైదరాబాద్లో చదువుతున్నది. (లంబాడీల్లో బోడ, గుగులోతు అనే ఇంటి పేర్లు ఉన్న వారు సోదరులు/ సోదరీమణులు అవుతారు) అక్కడే పార్ట్ టైం జాబ్ వెతుక్కుంది. చెల్లితో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నది. ఇల్లెందు మండలం నెహ్రూనగర్కు చెందిన గుగులోత్ వెంకటేశ్ (24)కి హైదరాబాద్లో చదువు పూర్తయింది. పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు అనుకోకుండా ఓ సందర్భంలో కలిశారు. వరుసకు చెల్లెలు అవుతుందని తెలిసినా ఇంటి పేరు మార్చి అమ్మాయి వెంటపడ్డాడు. బావనవుతానని, ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. ఒకే మండలం కాబట్టి పెద్దలు మన పెళ్లికి ఒప్పుకోరని అమ్మాయిని ప్రలోభ పెట్టాడు. వారికి తెలియకుండా పెళ్లి చేసుకుందామంటూ నమ్మించాడు.
పది రోజుల క్రితం హైదరాబాద్లో వెంకటేశ్, శ్వేత పెళ్లి చేసుకున్నారు. ఇంటి పేరు మార్చిన వెంకటేశ్ను శ్వేత నమ్మింది. గుడిలో చేసుకున్న వివాహానికి కేవలం స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. శ్వేత స్నేహితుల ద్వారా కుటుంబసభ్యులకు వారి పెళ్లి ఫొటోలు చేరాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శ్వేతను ఇంటికి పిలిపించారు. దీంతో శ్వేత, వెంకటేశ్లు ఎవరింటికి వారు వెళ్లారు. అన్నయ్య వరసయ్యేవాడిని ఎలా పెళ్లి చేసుకున్నావని శ్వేత తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో మనస్తాపం చెందిన శ్వేత పురుగుమందు తాగి సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నది.
ఉదయం విషయం తెలియగానే నెహ్రూ తండాకు చెందిన వెంకటేశ్ కూడా భయంతో పురుగుమందు తాగి ఇంట్లో ఉన్న బావిలోకి దూకాడు. కుటుంబ సభ్యులు యువకుడిని బయటకు తీసి ఖమ్మం తరలించారు. ప్రస్తుతం వెంకటేశ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. శ్వేత కుటుంబసభ్యులు, బంధువులు వెంకటేశ్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. ఎస్సై శ్రీనివాస్ అక్కడకు వెళ్లి శ్వేత కుటుంబసభ్యులు, బంధువులను శాంతింపజేశారు. ఇల్లెందు సీఐ బరపటి రమేశ్ దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పరామర్శించారు.