మామిళ్లగూడెం, సెప్టెంబర్14 : రాబోయే రోజుల్లో చింతకాని మండలం దళిత కుంటుంబాలకు సుమారు రూ.450 కోట్లతో 4 వేల కుటుంబాలకు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో దళితబంధు అమలు, మార్గదర్శకాలు, అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత సాధికారతకు ప్రతి అధికారి కుటుంబ పెద్దగా వారి ఆర్థిక ఎదుగుదలకు చేయూతనివ్వాలని పేర్కొన్నారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలాన్ని దళిత బంధు పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారని, దీనిపై ప్రతి అధికారి పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. సమగ్ర కుంటుంబ సర్వే ప్రకారం చింతకానీ మండలంలో 4,719 దళిత కుంటుంబాలున్నాయని, వీరిలో 60 శాతం మంది భూమి లేని నిరుపేదలు ఉన్నారని, 1644 కుంటుంబాలు ఎకరానికి తక్కువ భూమి కలిగినవారు, సుమారు 4 వందల మంది ఎకరం నుంచి రెండు ఎకరాలలోపు భూమి కలిగి ఉన్నారని, మిగిలిన వారికి ఎటువంటి భూములు లేవని కలెక్టర్ తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు చింతకాని మండలంలో పర్యటించి దళితుల స్థితిగతులను తెలుసుకోవాలన్నారు. రూ.10 లక్షలతో లబ్ధిదారుల ఆసక్తి మేరకు వివిధ యూనిట్ల స్థాపనకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి కుటుంబ పెద్దగా సలహాలు, సూచనలు అందించి ప్రోత్సహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. చింతకాని మండలంలో 26 గ్రామ పంచాయతీలున్నాయని, ఒక్కో గ్రామ పంచాయతీతీకి జిల్లా స్థాయి అధికారిని దళిత బంధు నోడల్ అధికారిగా నియమిస్తామన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్ మధుసూదన్, జడ్పీ సీఈవో వివి అప్పారావు, ఎస్సీ అభివృద్ధి శాఖ డీడీ కస్తాల సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.