ఖమ్మం, జూలై 7: ‘తెలంగాణలో అడవులు పెరగాలె.. కోతులు అడవికి వాపస్ పోవాలె..’ అన్న నినాదంతో ఆరేళ్ల క్రితం రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ర్టాన్ని ఆకుపచ్చ వనంగా తీర్చి దిద్దాలని ఇచ్చిన పిలుపును ప్రజలందరూ అందకున్నారు. ఆరేళ్లుగా ఏటా మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో ఏడో విడత హరితహారంలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, ప్రభుత్వ భూముల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటుతున్నారు. అధికారులు గత అనుభవాలను బేరీజు వేసుకుంటూ ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. శాఖల వారీగా నిర్దిష్ట లక్ష్యాలను తీసుకుని వాటిని ఛేదించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రతువులో ప్రజలను భాగస్వాములు చేస్తున్నారు.
నెరవేరుతున్న సీఎం కేసీఆర్ లక్ష్యం..
ఆకుపచ్చ తెలంగాణ సాధించేందుకు సీఎం కేసీఆర్ ఏటా ప్రతిష్ఠాత్మకంగా హరితహారం చేపడుతున్నారు. ఆరు విడతలుగా చేపట్టిన మొక్కల పెంపకం ఇప్పుడు సత్ఫలితాలనిస్తున్నది. ఖమ్మం జిల్లాలో ఆరేళ్లలో అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై కోట్లాది మొక్కలు నాటారు. అప్పుడు నాటిన మొక్కలు ఇప్పుడు నీడనిస్తున్నాయి. ప్రజలకు ఫలాలను అందిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో నాటిన మొక్కలు ప్రస్తుతం ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఏడో విడత హరితహారాన్ని విజయవంతం చేసేందుకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ శాఖల వారీగా లక్ష్యాలు కేటాయించారు. లక్ష్యాలను ఛేదించేందుకు ఆయా శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు.
మొక్కల సంరక్షణపై అవగాహన..
హరితహారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించింది. వర్షకాలం ఆరంభంలో మొదలయ్యే ఈ కార్యక్రమం జిల్లాలోని ప్రతి గ్రామంలో జరుగుతుంది. అధికారులు గ్రామగ్రామానా పర్యటించి మొక్కల పెంపకం ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా ప్రభుత్వం ప్రతి పంచాయతీకి నర్సరీ కేటాయించింది. ప్రతి నర్సరీలో టేకు, సుబాబుల్, జామాయిల్, టేకోమ, గన్నేరు, మందారం, ఉసిరి, దానిమ్మ, నిమ్మ, జామ, వేప, కానుగ, రావి మర్రి, సీమ తంగేడు, పెల్టోఫారం, గుల్మోహర్, కరివేపాకు, బొప్పాయి తదితర మొక్కలు పెరుగుతున్నాయి. ఈ మొక్కలను ఏటా నిర్వహించే హరితహారం కార్యక్రమానికి వినియోగిస్తున్నారు. రహదారుల పక్కన, పంచాయతీల్లోని ఖాళీ స్థలాల్లో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మొక్కలు నాటుతున్నారు.
ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్
మొక్కలు నాటడంతోనే సరిపోదని, నాటిన ప్రతి మొక్క ఎదిగే వరకు సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. నాటిన ప్రతిమొక్కకు అధికారులు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఈ హరితహారంలో ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మండల స్థాయిలో ఎంపీడీవోల పాత్ర కీలకమైంది. వీరు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లతో పాటు గ్రామస్థాయి ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఉపాధి సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం యంత్రాంగం హరితహారం లక్ష్యాలను సాధించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది.