సాగర్ ఆయకట్టు రైతుల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువన వరద నీరు రావడంతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటున్నది. ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఏటా ఆగస్టు మూడో వారం వరకు వానకాలం పంటలకు నీరు అందుతుందో లేదోనని మీ మాంసంలో ఉండే పరిస్థితులుండేవి. ఈ సారి ఎగువన ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో ఆయకట్టుపై పూర్తిస్థాయిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో మాగాణి, ఆంధ్రప్రదేశ్లోని మూడోజోన్లో 3 లక్షల ఎకరాల్లో మెట్ట పంటలకు సాగు నీటిని పాలేరు రిజర్వాయర్ నుంచి విడుదల చేస్తారు. ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో పాజెక్టుల్లోకి భారీగా వరద రావడంతో ఈ సారి సాగర్ ఆయకట్టుకు ఢోకా లేదని అధికారులు చెబుతున్నారు.
కృష్ణమ్మ పరవళ్లతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాగర్ జలాశయంపై ఉన్న ప్రాజెక్టులు ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం అన్నీ నిండుతుండడంతో సాగర్ ఆయకట్టు రైతులకు సమృద్ధిగా నీరు అందనున్నది. సాగునీటికి పెద్దపీట వేసిన తెలంగాణ సర్కారు మూడేళ్లుగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు పంటలకూ సాగు నీరందిస్తున్నది. గతంలో పలు దఫాలు సాగర్ నీరు లేకపోవడంతో ఆయకట్టులో కొత భాగం నీరందించగా.. మిగిలిన ప్రాంతం ఆరుతడి పంటలు వేశారు. కానీ ఈ సారి ఎగువన పడుతున్న వర్షాలతో జలాశయాలకు వరద పోటెత్తడంతో శ్రీశైలంపై అన్నీ డ్యాంలు నిండుకుండల్లా మారాయి. దీంతో సాగర్ ఆయకట్టుకు ఈ సారి పుష్కలంగా నీరు అందనున్నది. గతేడాది ఆగస్టు రెండో వారంలో పాలేరు నుంచి ఆయకట్టుకు నీటిని వదిలారు. ఈ సారి అంతకంటే ముందుగానే వదిలే అవకాశాలున్నాయి. సాగర్ ఎడమ కాలువ మొదటిజోన్ నల్లగొండ జిల్లాలో 5 లక్షల ఎకరాలు సాగు అవుతుండగా.. రెండో జోన్ ఖమ్మం జిల్లాలో పాలేరు నుంచి కల్లూరు వరకు 2.5 లక్షల ఎకరాల్లో వరి, మూడో జోన్ కల్లూరు నుంచి కృష్ణా జిల్లా నూజివీడు వరకు 3 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీరందిస్తున్నారు.
ఎగువన వరదలతో డ్యాంలకు జలకళ..
కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,705 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,693 అడుగులు ఉంది. ఆల్మట్టి నిండితే జూరాల, తర్వాత శ్రీశైలం, సాగర్ డ్యాంలకు నీరొస్తుంది. జూరాలకూ వరద పోటెత్తడంతో శ్రీశైలానికి 3.70 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం నీటిమట్టం శరవేగంగా పెరుగుతున్నది. శ్రీశైలం నిండితే సాగర్కు వదులుతారు. పైన డ్యాంలు అన్నీ నిండితే వర్షం పడినా.. ఆ నీటిని కిందకు వదలక తప్పదు. దీంతో మరో వారం రోజుల్లో శ్రీశైలం, సాగర్ జలాశయాలకు భారీగా వరద నీరొచ్చే అవకాశాలున్నాయని నీటిపారుదలశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. శ్రీశైలానికి వరద ఇలానే కొనసాగితే మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు నిండనున్నది. శ్రీశైలం నుంచి వారం రోజులపాటు నీరొస్తే సాగర్ జలాశయం పూర్తిగా నిండుతుందని నీటిపారుదల అధికారులు చెబుతున్నారు.
నారుమళ్లలో మడికట్లు సిద్ధం..
సాగర్ ఆయకట్టు కింద వరినాట్లు వేసుకునేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నార్లు పోసుకున్న రైతులు నీటి విడుదలైన వెంటనే నాట్లు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది సాగర్ ఆయకట్టుకు పుష్కలంగా నీరు అందడంతో రైతులకు మంచి దిగుబడులు వచ్చాయి.
గతంలో నార్లు పోసుకొని వాటిని కూలీలతో తీయించి నాట్లు వేసేది. కానీ ఆధునిక పద్ధతిలో బురద పొలం సిద్ధం చేసి నారు చల్లడం,డ్రమ్సీడ్ విధానం.. నేరుగా ఎద పెట్టడం వంటివాటితో ఎకరాకు రూ.7 వేల వరకు రైతులకు లాభం వస్తుందని వ్యవసాశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎక్కువ మంది రైతులు నూతన విధానానికే మొగ్గు చూపుతున్నారు. గతంలో వెదజల్లినా, డ్రమ్ సీడ్ పెట్టినా మంచి దిగుబడులు రావడంతో రైతులు కూలీల ఖర్చుతోపాటు ఎకరాకు 7 వేలు కలిసి వస్తుందని.. అటువైపు మొగ్గుచూపుతున్నారు. కొంతమంది రైతులు డ్రమ్సీడ్ మిషన్ను కొనుగోలు చేశారు. గ్రామాల్లో రైతులు డ్రమ్ సీడ్ మిషన్ను కొనుగోలు చేయడంతో స్థానిక రైతులకు ఇది ఉపయోగపడుతుంది. రైతుకు బాడుగ వస్తుంది.
సాగునీటికి ప్రాధాన్యం
సాగర్ ఆయకట్టు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీరందివ్వడం కోసం గతేడాది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంటలు పుష్కలంగా పండాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటికి ప్రాధాన్యమిస్తున్నది. సాగర్ ఎగువన ప్రాజెక్టులన్నీ నిండడంతో ఈ సారి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో రెండుపంటలకు నీరు అందునున్నది.