ఖమ్మం, జూలై 24: వినయ, విధేయ గుణధాముడు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తండ్రికి తగిన తనయుడు ఈ తారకరాముడని కీర్తించారు. తెలంగాణ యూత్ ఐకాన్గా, పార్టీ నేతలకు మార్గదర్శకుడిగా, తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డగా ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కేటీఆర్కు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నిర్వహిస్తున్న ‘ముక్కోటి వృక్షార్చన‘ లో మంత్రి అజయ్ పాల్గొన్నారు. ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలంలో నిర్దేశించిన లక్షన్నర మొక్కలను కార్పొరేటర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నాటించారు.
ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని ఐటీ ఎగుమతుల్లో నెంబర్ వన్ చేసిన ఘనత, ప్రపంచంలోనే ఉత్తమమైన ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చిన ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందని అన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీగా టీఆర్ఎస్ను తీర్చిదిద్దిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ తలలో నాలుకలా కొనసాగుతున్న కేటీఆర్ పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యుడు సంతోశ్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అభినందించదగినదని అన్నారు.
ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, కార్పొరేటర్ కమర్తపు మురళి, టీఆర్ఎస్ నాయకులు స్వర్ణకుమారి, రామ్మూర్తి, తాజుద్దీన్, పగడాల నాగరాజు, ముక్తార్, కృష్ణ చైతన్య, కొల్లు పద్మ, తన్నీరు శభారాణి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.