తల్లాడ, జూలై 20 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ ఫలాలను నిరుపేద దళిత కుటుంబాలకు అందించేందుకు తెలంగాణ దళితబంధు పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ అభినవ అంబేడ్కర్ అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొనియాడారు. మంగళవారం మండలకేంద్రంలో దళితబంధు పథకాన్ని హర్షిస్తూ వర్షంలో డప్పులతో భారీప్రదర్శన నిర్వహించారు. స్థానిక జీఎన్ఆర్ గార్డెన్స్ నుంచి ప్రదర్శన ప్రారంభం కాగా జోరుగా వర్షం కురిసింది. భారీ వర్షంలోనే డప్పుల ప్రదర్శన బస్టాండ్, హైస్కూల్ మీదుగా రింగ్రోడ్డు సెంటర్ వరకు సాగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సిద్దించిన 74 ఏళ్లలో దళిత కుటుంబాల సామాజిక ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అన్ని నిరుపేద దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు 40 వేల కోట్లతో రూపకల్పన చేసిన దళితబంధు దేశంలోనే ఆదర్శవంతమైన పథకం అన్నారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని దళితులందరికీ రైతుబీమా తరహాలో 5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం, సొంత స్థలాల్లో డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారన్నారు.
దళితుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారన్నారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తే బ్యాంక్ కాన్సెంట్ పేరుతో దళితులకు లోన్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ 50 వేల ఉద్యోగాల నియామకాలకు ఉత్తర్వులు జారీచేయనున్నట్లు తెలిపారు. పేద కుటుంబాల్లో వివాహ ఖర్చులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని, 50 వేలతో ప్రారంభమైన పథకం ప్రస్తుతం లక్షా 116 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. పేదల ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దుగ్గిదేవర వెంకట్లాల్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ దూపాటి భద్రరాజు, సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారపోగు వెంకటేశ్వర్లు, సర్పంచ్లు శీలం కోటారెడ్డి, జొన్నలగడ్డ కిరణ్బాబు, కుర్నవల్లి సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్రెడ్డి, బద్ధం కోటిరెడ్డి, దిరిశాల దాసురావు, నల్లబోతు రామారావు, కేతినేని చలపతి, మువ్వా మురళీ, ఇనుపనూరి అంబేడ్కర్, ఆదూరి వెంకటేశ్వర్లు, వరపర్ల ఉదయ్, అద్దంకి వెంకటేశ్వర్లు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, రుద్రాక్షల బ్రహ్మం, కోడూరి వీరకృష్ణ, సుదర్శన్, పొట్టేటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు.