ఖిలావరంగల్, జూలై 20: తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రదేశాలను వీక్షించే విధంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) భారత్ దర్శన్ యాత్ర ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. వచ్చే నెల 27న మాతా వైష్ణోదేవి దర్శనం ఉత్తర భారత యాత్ర పేరుతో ప్రారంభం కానున్న ప్రత్యేక రైలు సికింద్రాబాద్, కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా వెళుతుంది.టీ యాత్ర వివరాలను వరంగల్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కిశోర్ వెల్లడించారు.
రేణిగుంటలో ఆగస్టు 27న మధ్యరాత్రి రైలు బయలుదేరి సాయంత్రం కాజీపేట రైల్వేస్టేషన్కు చేరుకుంటుందని తెలిపారు. యాత్రలో ఉత్తర భారతదేశంలోని ఆగ్రా, మధుర, ఢిల్లీ, హరిద్వార్, అమృత్సర్, వైష్ణోదేవి క్షేత్రాలను దర్శించుకోవచ్చన్నారు. రేణిగుంటలో బయలుదేరిన రైలు తెలంగాణలో నల్లగొండ, సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం రైల్వేస్టేషన్లలో బోర్డింగ్, డిబోర్డింగ్ ఉంటుందన్నారు. పది రాత్రులు, 11 రోజులతో కూడిన ఈ యాత్రకు ఒక్కొక్క టికెట్ ధర స్లీపర్లో అయితే రూ.10,400, ఏసీ త్రీ టైర్ అయితే రూ.17,330 నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం టీ, కాపీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజన సదుపాయ కల్పించామని, అలాగే ప్రతి ప్రయాణికుడికి రోజుకు ఒక లీటర్ వాటర్ బాటిల్ అందజేస్తామన్నారు. అలాగే రోడ్డు మార్గంలో వెళ్లేటప్పుడు నాన్ ఏసీ వాహనాలను అందుబాటులో ఉంచామన్నారు. దర్శనీయ స్థలాల్లో రాత్రులు పడుకునేందుకు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు ధర్మశాలలు, డార్మెంటరీ గదులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.
పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. అలాగే కొవిడ్ నిబంధనలలో భాగంగా బోగీలను నిత్యం శానిటైజేషన్ చేయడం, ప్రయాణికుడికి ఉచితంగా శానిటైజర్, రోజుకు ఒక మాస్క్ అందజేస్తామన్నారు. అలాగే ప్రయాణికుడికి ఇన్సూరెన్స్తోపాటు అన్ని సేవలు టికెట్ ధరలోనే అందుతాయన్నారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నెం. 040-27702407, 9701360701, 8287932228/9 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. అలాగే సెప్టెంబర్ 25న సికింద్రాబాద్ నుంచి మహాలయ పిండదాన్ తర్పన్ పేరుతో ప్రత్యేక రైలు ప్రారంభమవుతుందన్నారు. ఆరు రాత్రులు ఏడు రోజుల పాటు సాగే ఈ యాత్ర టికెట్ ధర స్లీపర్కు రూ.6,620, త్రీ ఏసీ అయితే రూ.11,030గా నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే అక్టోబర్ 19న దక్షిణ్ భారత్ యాత్ర రైలు ప్రారంభమవుతుందన్నారు.