కరోనా ప్రభావం అనంతరం ఆలయాల్లో తొలి పండుగ
ఉపవాసాలు.. విష్ణు పూజలతో తరించిన భక్తగణం
ఖమ్మం కల్చరల్, జూలై 20 : ఆషాఢ శుధ్ద ఏకాదశి ‘తొలి ఏకాదశి’ పండుగను మంగళవారం జిల్లా వ్యాప్తంగా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. చాతుర్మాస్య వ్రతం ఆరంభంతో పాటు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు నిష్టతో గోపద్మ వ్రతాన్ని ఆచరించారు. హరిహరాదులకు వేడుక కావడంతో జిల్లాలోని శైవ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆయా ఆలయాల్లో తమ తమ ఇష్ట దైవాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానంగా శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి సృష్టి సంరక్షణను సమీక్షించే కాలం ప్రారంభం కావడంతో విష్ణు ధ్యానం, విష్ణు పూజలతో భక్తులు తరించారు. ఆలయాల్లో శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం, శ్రీలలితా సహస్ర నామ పారాయణాలతో వైష్ణవ ఆలయాలు మార్మోగాయి. ధాన్యతగా మొక్కజొన్న పేల పిండిని నివేదించి ప్రసాదంగా స్వీకరించారు.
శివాలయాల్లో భక్తులు త్రినేత్రుడికి పత్రాలు, దళాలు, జలం, పంచామృతాలతో అభిషేకం చేసి స్వామిని ప్రసన్నం చేసుకున్నారు. శివ నామస్మరణలో పలు శివాలయాలు మార్మోగాయి. ఖమ్మం నగరంలోని శ్రీభ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుఝామునుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామి దర్శనం చేసుకుని పూజలు చేశారు. ప్రాచీన దివ్యక్షేత్రం శ్రీస్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు నరహరి నర్సింహాచార్యులు భక్తులతో పూజలు చేయించారు. కమాన్బజార్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడు రఘునాథాచార్యులు, బి.కె.బజార్ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు నైనకంటి హరికృష్ణ శర్మ, ముడుంబా పవన్కుమార్లు స్వామికి సింధూరం, తమలపాకు పూజలను శాస్ర్తోక్తంగా చేశారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అనంతరం తెరుచుకున్న దేవాలయాల్లో తొలి పండుగగా తొలి ఏకాదశి పర్వం అత్యంత వైభవంగా జరుపుకున్నారు.